మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 20 : దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వైరస్పై అప్రమత్తంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కొవిడ్ జాగ్రత్తలకు సంబంధించి వాల్పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పీహెచ్సీల్లో ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధం చేసుకోవాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.
రానున్న పండుగల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైతేనే బయటకు రావాలని, తప్పని సరిగా మాస్కులు వాడాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలో 152 ప్రభుత్వ, 17 ప్రైవేటు దవాఖానలను కలుపుకొని మొత్తంగా 1461 బెడ్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాల్లో 7438 పీపీఈ కిట్స్, 20715 ఎన్ 95 మాస్క్లు, 304 ఆక్సీమీటర్లు, 108 నెబ్లైజర్లు, 249 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే శబరికి వెళ్లి వస్తున్న అయ్యప్ప స్వాములు, భక్తులు పూర్తి జాగ్రత్తలు పాటించాలని కోరారు. డీఎస్వో, కొవిడ్ నోడల్ అధికారి డా.ఫయాజ్, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.