నార్నూర్, జూన్ 27: వానకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా మారిపోతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. వర్షానికి కాలువల్లోని మురుగు నీరు రోడ్లు, ఇళ్ల ముందుకు చేరుకోవడం, లోతట్టు ప్రాంతాలు ఎప్పుడూ నీటితో నిండిపోయి దోమలకు ఆవాసంగా మారుతాయి. ఈ క్రమంలో దోమలు పెరిగి మలేరియా, డెంగీ, పచ్చకామెర్లు, డయేరియా ప్రజలను పట్టిపీడిస్తాయి. అపరిశుభ్రత వల్ల కూడా ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ నేపథ్యంలో ప్రజల తగిన జాగ్రత్తలు పాటించి రోగాలు దరిచేరనీయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తం..
ఇప్పటికే సీహెచ్సీ, పీహెచ్సీలకు రోగుల తాడికి పెరిగింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, విరేచనాలు వంటి బాధలతో దవాఖానలకు చేరుకొని చికిత్స పొందుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తమై పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ మొదలుపెట్టారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కువ రోజులు జ్వరంతో బాధపడుతున్న వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో ఇంటింటికీ వైద్య సేవలు అందుతుండడంతో జ్వరపీడుతులు లేకుండా చేయవచ్చని అందరూ భావిస్తున్నారు.
మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే..
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని అధికారులు, వైద్య నిపుణులు అంటున్నారు. ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు ఉన్న కారణంగా వాడుకనీరు పెరిగింది. మన అవసరాలకు వాడిన నీరు లోతట్టు ప్రాంతంలో, గుంతలోకి చేరి, అందులోకి గాలుల ద్వారా చెత్తాచెదారం చేరి దోమలకు నిలయంగా మారుతుంది. ఇలా జరగకుండా చూస్తే దాదాపు వ్యాధుల నుంచి మనం తప్పించుకున్నట్లేనని వైద్యారోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.
దోమలు ఇలా పెరుగుతాయి…
నియంత్రణ చర్యలు..
అందుబాటులో అన్ని రకాల మందులు…
సీజనల్ వ్యాధుల బారినపడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. దవాఖానలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున జ్వరం, దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యుల సలహాలు, సూచనలతో మందులు వాడితే సరిపోతుంది.
–రాంబాబు, వైద్యాధికారి, సీహెచ్సీ, నార్నూర్
పారిశుధ్య పనులు చేయిస్తున్నాం..
ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ఎక్కడా మురుగునీరు, చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. దోమల ఆవాసాల్లో నివారణ మందు చల్లుతున్నాం.
–కావల రమేశ్, ఎంపీడీవో, నార్నూర్