నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 7 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నందున ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సర్పంచ్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, దానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా తయారు చేసుకోవాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిధుల చెల్లింపులో జాప్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పనులు పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తున్న నేపథ్యంలో పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్రావు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎల్పీవోలు, సర్పంచ్లు పాల్గొన్నారు