మంచిర్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో వైద్యారోగ్యశాఖకు నిర్లక్ష్యపు రోగం పట్టుకున్నది. ఏమాత్రం సమయపాలన పాటించకుండా నిద్రావస్థలో తూగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాల్సిన అధికారులు, సిబ్బంది, ఉదయం 11 గంటలైనా రావడం లేదన్న విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్ విజిట్ చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని 17 పీహెచ్సీలు(ప్రైమరీ హెల్త్ సెంటర్లు), 4 యూపీహెచ్సీలు(అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు), 3 సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్టు), బస్తీ దవాఖానలను సందర్శించగా, ఎక్కడా ఏ ఒక్క అధికారి కానీ.. సిబ్బంది కానీ.. 9 గంటలకు విధులకు రాకపోవడం గమనార్హం.
‘నమస్తే తెలంగాణ’ వెళ్లి ఖాళీ కుర్చీలు, తాళాలు వేసి ఉన్న పీహెచ్సీల ఫొటోలు తీశాక, స్వీపర్లు సిబ్బంది ద్వారా సమాచారమందుకొని హుటాహుటిన విధులకు వచ్చారు. పాత మంచిర్యాల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముస్తఫా ఉదయం 9.10 గంటలకు విధులకు వచ్చారు. ఇలాంటి విజిట్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన, జిల్లా డాక్టర్ల వాట్సప్ గ్రూప్లో మెస్సేజ్ పెట్టి.. మిగిలిన డాక్టర్లను అలర్ట్ చేశారు. “ఆల్ ఆఫ్ యూ బీ అలర్ట్, ఎట్ షార్ప్ 9 ఏఎం వోన్లీ” అని ఆయన పెట్టిన మెస్సేజ్కు తాళ్ల గురిజాల పీహెచ్సీ డాక్టర్ ఇమాంజనిల్ “యస్ థే హ్యావ్ టేకెన్ ఫొటోస్ ఆఫ్ మెనీ పీహెచ్సీస్, ఆల్ ఆర్ షోయింగ్ ఎంప్టీ చైర్స్” అంటూ మరో మెస్సేజ్ పెట్టారు.
ఈ మేడమ్ ఉదయం 9.26 గంటలకు డ్యూటీకి వచ్చారు. విషయం తెలుసుకున్న మెడికల్ ఆఫీసర్లు హుటాహుటిన పీహెచ్సీలకు పరుగులు పెట్టారు. కొన్నిచోట్ల సిబ్బందిని అలర్ట్ చేసి పంపించారు. రోజూ 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో విధులకు వచ్చే డాక్టర్లు సైతం ‘నమస్తే’ విజిట్ గురించి తెలుసుకొని ఉదయం 10.30లోపు వచ్చారంటూ ఆయాచోట్ల పని చేసే సిబ్బంది గుసగుసలాడుకోవడం కనిపించింది. డాక్టర్లకు గ్రూప్లో సమాచారమివ్వడం వల్ల ఈ ఒక్క రోజు ముందు డ్యూటీకి వచ్చారు. అదే విషయం తెలిసి ఉంటే తాము కూడా ముందే వచ్చే వాళ్లమని ఒకరికొకరు చెప్పుకోవడం కనిపించింది. రోజూ డాక్టర్ కంటే ముందు వచ్చేవాళ్లం.. ఈ రోజు లేట్గా వచ్చినట్లయ్యిందంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.
డాక్టర్ల గ్రూప్లో మెస్సేజ్తో త్వరగా పీహెచ్సీలకు వచ్చిన వైద్యాధికారులు రిపోర్టర్లతో అత్యుత్సాహం ప్రదర్శించారు. మీరు వస్తారని మాకు ముందే తెలుసు.. మా వాట్సప్ గ్రూప్లో మెస్సేజ్ వచ్చిదంటూ కొందరు డాక్టర్లు జోక్లు చేస్తూ వెకిలి వేషాలు వేశారు. కొందరు మెడికల్ ఆఫీసర్లు సిబ్బందితో ఫోన్లు మాట్లాడించి.. మా ఇంట్లో వాళ్లకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే సమయానికి రాలేకపోతున్నామని.. కొంచెం చూడాలంటూ రిక్వెస్ట్ చేశారు. మంచిర్యాలతో పాటు బెల్లంపల్లి, చెన్నూర్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్సీలు, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు కొంత ఆలస్యంగా విధులకు హాజరైనప్పటికీ.. మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే వైద్యాధికారులు, సిబ్బంది గంట, గంటన్నర ఆలస్యంగా వచ్చారు.
నమస్తే తెలంగాణ పరిశీలించిన పీహెచ్సీల్లో వైద్యులు డ్యూటీకి వచ్చిన టైమింగ్ వివరాలిలా ఉన్నాయి.. కన్నేపల్లి పీహెచ్సీకి 10.25, తాండూర్లో 10.34, హజీపూర్లో 10.15, వేమనపల్లిలో 11.17, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడ బస్తీ దావాఖానాకు 11.36, రాజీవ్నగర్లో 10.20, నస్పూర్లో 9.17, జన్నారంలో 9.25, భీమిని 10.27, తాళ్లపేటలో 9.45, నెన్నెల 10.10, తాళ్ల గురిజాలలో 9.50, జైపూర్లో 9.30, మందమర్రిలో 9.26, కోటపల్లిలో 9.40 గంటలకు మెడికల్ ఆఫీసర్లు విధులకు వచ్చారు.
డాక్టర్లు ఆలస్యంగా రావడంతో కొన్నిచోట్ల సిబ్బంది వైద్యం చేస్తూ కనిపించారు. నెన్నెల పీహెచ్సీలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వార్డుబాయ్ ట్రీట్మెంట్ చేస్తూ కనిపించారు. జన్నారం పీహెచ్సీలో ఏఎన్ఎం స్లైన్ ఎక్కిస్తూ కనిపించారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యాధికారులకంటే ఆలస్యంగా స్టాఫ్నర్సులు, ఫార్మసిస్టులు, వార్డు బాయ్స్ ఇతర సిబ్బంది రోజూ వచ్చినట్లే 10 గంటల తర్వాత ఒకొక్కరిగా విధులకు హాజరయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వంలో వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో అప్పటి కలెక్టర్ భారతీ హొళికేరి అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఒకరిని నియమించారు. ప్రతి రోజూ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్నాక బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉండేది. దాని ఆధారంగానే వారికి వేతనాలు సైతం ఇచ్చేవారు. కానీ.. కొన్ని నెలలుగా బయోమెట్రిక్ అటెండెన్స్ అటకెక్కింది.
దీంతో వైద్యాధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతూ వస్తున్నది. వైద్యాధికారుల ఇష్టారాజ్యం గురించి డీఎంహెచ్వోకు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని తెలిసింది. బయోమెట్రిక్ హాజరుతో సంబంధం లేకుండా మ్యానువల్గా అందరికీ వేతనాలు ఇవ్వడం వెనుక మర్మమేమిటనేది తెలియాల్సి ఉంది. వైద్యాధికారుల నిర్లక్ష్యంతో వైద్యం కోసం వచ్చే జనాలు ప్రైవేటుకు తరలిపోతున్నారు. ముమ్మాటికీ ఇది వైద్యుల కారణంగానే జరుగుతున్నా.. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై డీఎంహెచ్వో సుబ్బారాయుడిని వివరణ కోరగా.. “ఇటీవల కలెక్టర్ రివ్యూలో బయోమెట్రిక్, పేషియల్ అటెండెన్స్ పెట్టాలని సూచించాం. ఈ మేరకు వైద్యాధికారులు సమాచారం అందించాం. విధులకు ఆలస్యంగా రావొద్దని చెప్పాం. ఈ రోజు 21 మంది సమయానికి వచ్చినట్లు నాకు చెప్పారు. కానీ మీ పరిశీలినలో వైద్యాధికారులు ఆలస్యంగా వచ్చినట్లు తేలిందంటున్నారు. మరొకసారి పరిశీలించి వైద్యాధికారులు సమయానికి విధులకు హాజరయ్యేలా చూస్తాం. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎవ్వరినీ వదిలేదు లేదు.’ అని చెప్పారు.