నిర్మల్ చైన్గేట్, మే 19 : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో నాగమణి ఆధ్వర్యంలో మిల్లెట్స్ మాస్టర్ చెఫ్ కుకింగ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లో అనేక పోషక విలువలు ఉన్నాయన్నారు. చిరుధాన్యాలతో పాటు ఆకుకూరలు, పాలు, గుడ్లు తీసుకోవాలని పేర్కొన్నారు.
అంతకుముందు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు రుచికరమైన వంటలు తయారు చేసి పోటీల్లో ప్రదర్శించారు. పోటీల్లో ప్రథమ విజేతగా అరుణ, ద్వితీయ విజేతగా శ్యామల, తృతీయ విజేతగా రేఖ, నియోజకవర్గం విజేతగా కవిత నిలిచారు. వీరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ స్వరూప, డాక్టర్ సౌమ్య, స్త్రీనిధి ఆర్ఎం సరిత, డీఆర్డీవో సీసీ గంగాప్రసాద్, సూపర్వైజర్లు విజయగౌరి, రజని, భాగ్యవతి, సావిత్రి, ప్రసూన, మంగళ, ఏఎన్ఎం సుమతి, శోభ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.