ఇచ్చోడ, జూన్ 5 : బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా సెక్టోరల్ అధికారులు నారాయణ, సుజాత్ ఖాన్ అన్నారు. మండలంలోని ఆడెగాం(బీ), జామిడి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి జిల్లా సెక్టోరల్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు-మన బడి పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, అదే విధంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి నోట్ పుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాథోడ్ ఉదయ్రావ్, జామిడి సర్పంచ్ సుభాష్, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ గంగుబాయి, అంగన్వాడీ కార్యకర్తలు శ్యామల, వజ్రమాల, ప్రధానోపాధ్యాయులు బాపురావ్, అడిగామ(బీ) సర్పంచ్ కదం వనిత, ఎస్ఎంసీ చైర్మన్ ప్రకాశ్, అంగన్వాడీ కార్యకర్త అనురాధ, ప్రధానోపాధ్యాయులు భూమన, సీఆర్పీ శ్యాం సుందర్, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జూన్ 5 : మండలంలోని సీతాగోంది, మన్నూర్ గ్రామాల్లో జిల్లా పరిషత్,ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోఎంఈవో నారాయణ పాల్గొని మాట్లాడారు ప్రైవేట్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టొరియల్ అధికారులు సుజాత్ఖాన్, నారాయణ, ప్రధానోపాధ్యాయుడు లచ్చన్న, సీఆర్పీ నాగోరావ్ పాల్గొన్నారు.
తాంసి, జూన్ 5: మండలంలోని హస్నాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖోడద్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వెంకన్న ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఓరగంటి పురుషోత్తంతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీఈటీ మమత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తలమడుగు, జూన్ 5 ః మండలంలోపి ఉమ్రి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రూపేశ్, అంగన్వాడీ టీచర్లు, మహిత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.