కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని కస్టమ్ హైరింగ్ (రైతులకు పరికరాలు-యంత్రాలు అద్దెకిచ్చే కేంద్రం) సెంటర్ అలంకార ప్రా యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారగా, లక్షలాది రూపాయల విలువైన ట్రాక్టర్తో పాటు పరికరాలు తుప్పు పట్టే పరిస్థితి వచ్చింది.
సాగులో యాంత్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణాభివృద్ధిశాఖ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్ల’(వ్యవసాయ పరికరాలు-యంత్రాల అద్దె కేంద్రాలు)ను ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మి మహిళా సంఘం ద్వారా కూడా ఓ సెంటర్ను ప్రారంభించింది. సుమారు రూ. 20 లక్షలతో ట్రాక్టర్తో పాటు అన్ని రకాల పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు తమ అవసరాన్ని బట్టి వాడే పనిముట్లు, యంత్రాలకు ధరలు నిర్ణయించింది.
కానీ.. నిర్వహణ లేకపోవడంతో ఈ కేంద్రం అలంకార ప్రాయంగా మారింది. అధికారుల పట్టింపులేని తనంతో పాటు మహిళా సంఘాలకు సరైన అవగాహన లేకపోవడంతో ట్రాక్టర్తో పాటు పనిముట్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. మహిళా సంఘాలకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు రైతులకు తక్కువ ధరలకే పనిముట్లు అందించాల్సిన కస్టమ్ హైరింగ్ కేంద్రం నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.