కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : గొల్ల కుర్మలకు జీవనాధారమైన గొర్రెల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా..లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. కుల వృత్తులకు జీవం పోసిన కేసీఆర్ సర్కారు.. గొల్ల కుర్మల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో గొల్ల కుర్మలు ఎంత మంది ఉన్నారనే దానిపై సర్వేలు నిర్వహించింది. 2017లో 4,404 మంది అర్హులను గుర్తించింది. మొదటి విడుతలో 2891 మందికి గొర్రెల యూనిట్లు అందించింది.
ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున పంపిణీ చేసింది. ఆ తర్వాత రెండో విడుతలో మిగతా లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కరోనా తదితర కారణాలతో జాప్యమైంది. దీంతో 1513 మందికి ఇప్పటి వరకు గొర్రెల యూనిట్లు అందలేదు. ఈ పథకం విలువ రూ. లక్షా 75 వేలు కాగా, లబ్ధిదారులు రూ. 43,750 డీడీ రూపంలో చెల్లిస్తే మిగతా రూ. లక్షా 31 వేల 250 ప్రభుత్వం సబ్సిడీని కలిపి గొర్రెలను అందించాల్సి ఉంది.
ఇక రెండో విడుతలో గొర్రెలు వస్తాయని భావించిన 562 మంది లబ్ధిదారులు రూ. 43,750 చొప్పున డీడీలు కట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా 230 మందికి గొర్రెలను అందించింది. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మిగతా 332 మందికి గొర్రెలు పంపిణీ చేయలేదు.
వీరికి కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలను అందిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక గొర్రెల పథకానికి అర్హులైన 951 మంది డీడీ కట్టలేదు. రెండో విడుత గొర్రెల పంపిణీ సందిగ్ధంలో ఉండగా మిగతా లబ్ధిదారులు డీడీలు కట్టేందుకు వెనుకాడుతున్నారు. రెండో విడుతలో డీడీలు కట్టిన వారి డబ్బులు తిరిగి ఇస్తారా.. లేక గొర్రెలను అందిస్తారా అనేదానిపై స్పష్టత కరువైంది.