ఎదులాపురం, మే 3 : తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా యువత కష్టపడి చదువుతూ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్డడీ సర్కిల్లో గ్రూప్-2నకు సంబంధించి మూడు నెలల ఉచిత శిక్షణ పూర్తయిన నేపథ్యంలో అభ్యర్థులకు బుధవారం స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బీసీ స్టడీ సర్కిల్లో మూడు నెలల ఉచిత శిక్షణ అందించగా.. విజయవంతంగా పూర్తయ్యిందన్నారు.
పరీక్ష తేదీ వరకున్న సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆగస్టు చివరి వారంలో గ్రూప్-2 పరీక్ష ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు నాలుగు నెలల సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలన్నారు. దేశ ప్రగతి కోసం పాటు పడ్డ మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. అభ్యర్థులకు సన్నద్ధత కోసం స్టడీ సెంటర్ల వారీగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీవో రాజలింగం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, నాయకలు మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.