ఖానాపూర్ టౌన్, మార్చి 2 : పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ఖానాపూర్ పట్టణ శివారులో పూర్తయ్యాయి. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి 700పైగా మందిని అర్హులుగా గుర్తించారు. ఖానాపూర్లోని ఏఎంకే ఫంక్షన్హాల్లో అదనపు కలెక్టర్ రాంబాబు, నోడల్ అధికారి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం 400 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా పారదర్శకంగా ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక ఇంటి నంబర్తో తుది జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రత్నాకర్రావు, తహసీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీవో బాల మల్లేశం, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్, నిర్మల్ మండలాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఖానాపూర్ శివారులోని కుమ్రం భీం చౌరస్తాలో నిర్మించిన 400 డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్హాల్లో నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పేదలకు న్యాయం చేసేలా 700పైగా మంది అర్జిదారుల నుంచి లక్కీడ్రా పద్ధతిలో 400 మందిని ఎంపిక చేసి ఇండ్లు కేటాయించామమని చెప్పారు. ఇండ్లు రాని వారికి స్థలం కేటాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల నాయకులు చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.
ఖానాపూర్ రూరల్, మార్చి 2 : పేదల సొంతింటి కలనేరవెర్చింది తెలంగాణ ప్రభుత్వం. ఖానాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఏడో వార్డుకు చెందిన గరుక జమున వెళ్లింది. అదే సమయంలో ఆమె కూతురు కళాశాలకు వెళ్లి ఇంటికి వస్తున్నది. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించిన తర్వాత ఇంటికి వస్తున్న జమునకు కూతురు ఎదురైంది. బిడ్డా మనకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందంటూ తల్లి తన కూతురును హత్తుకుంది. సంతోషంతో ఆ కూతురు కండ్లు చెమ్మగిల్లాయి. పేద కుటుంబాలకు అండగా దేవుడు కేసీఆర్ ఉన్నాడని సంబోంధించింది. కొన్నేళ్లుగా ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నామని, కూలీ చేయగా వచ్చిన డబ్బులు సగం కిరాయిలకు వెళ్లేవని, ఇక ఆ కష్టాలు తీరాయని తల్లీకూతుళ్లు ఆనందంగా చెప్పారు.
ఖానాపూర్ రూరల్, మార్చి 2 : ఏండ్లుగా ఎదురు చూస్తున్న గూడు గోడు తీరింది. అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిండ్రు. మా కేసీఆర్ సార్ మా కల నెరవేర్చాడు. కిరాయి ఇండ్లలో ఉంటున్న మాకు కేసీఆర్ సర్కార్ ఈరోజు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చింది. నిన్నటి దాక దశదిశ లేని మా జీవితాలకు తెలంగాణ ప్రభుత్వం దేవుడిలా వచ్చి శాశ్వత గూడునిచ్చింది. నా కళలో కూడా ఊహించని సంబురంతో ఇల్లు ఇచ్చిన కేసీఆర్ సారు పదికాలాల పాటు సల్లంగుండాలి. – లోకిని జల, ఏడోవార్డు, ఖానాపూర్
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్లు కట్టుకోవాలన్న మా ఆశ నేటితో నెరవేరింది. నేను కూలీ పని చేసుకుంటూ కిరాయికి ఉంటున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించి డబుల్ బెడ్రూం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. కేసీఆర్ సార్ ఫొటోను మా ఇంట్లో పెట్టుకుంటాం.
-కట్టెకోల చంద్రకళ, తొమ్మిదోవార్డు, శాంతినగర్
తెలంగాణ ప్రభుత్వం మాలాంటి గరీబోళ్లను గుర్తించి డబుల్ బెడ్రూం ఇవ్వడంతో మా జీవితం మెరుగుపడుతుంది. ఇన్నేళ్ల పాలనలో మమ్మల్ని గుర్తించిన నాయకులు లేరు. బీఆర్ఎస్ వచ్చాక ఉచితంగా బియ్యం, పింఛన్, తాగునీరు, ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు, మందులు ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సార్, ఎమ్మెల్యే రేఖానాయక్కు ధన్యవాదాలు.
-అబ్దుల్ ముషారత్బేగం, ఎనిమిదోవార్డు, పద్మావతినగర్