చింతలమానేపల్లి , డిసెంబర్ 21 : అద్దె చెల్లించలేదని ధరంపల్లి ప్రభుత్వ పాఠశాల(డబ్బాలో అద్దె ఇంటిలో కొనసాగుతుంది)కు యజమాని తాళం వేయడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. గురువారం డబ్బా ఎక్స్రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. వెంటనే పాఠశాల అద్దె చెల్లించి.. పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం ఎంఈవో సోమయ్య డబ్బా ఎక్స్రోడ్ వద్దనున్న బొగ్గుల లక్ష్మి ఇంటిని అద్దెకు తీసుకొని ధరంపల్లి పాఠశాలను కొనసాగిస్తున్నారు. ఇందులో 22 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా.. ఏడు నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో గురువారం సదరు యజమాని ఇంటికి తాళం వేసింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అధికారులు పాఠశాల కొనసాగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.