సారంగాపూర్, జనవరి 6;సమాజంలో వేసే ప్రతి అడుగుకూ అంగవైకల్యం అడ్డుకారాదు.. మనోైస్థెర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో దివ్యాంగులకు భవిత కేంద్రాలు శిక్షణనందిస్తున్నాయి. నిత్యకృత్యాలతో పాటు విద్య, స్పీచ్థెరపీ, తదితరాల్లో వారికి మెళకువలను నేర్పిస్తున్నాయి. పుట్టుకతో, చిన్న వయస్సులో వైకల్యం ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భరోసానిస్తున్నాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విశిష్ట సేవలందిస్తూ అండగా నిలుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో 172 మంది ఈ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన ఐదేళ్ల పైబడి 18 ఏళ్ల లోపు పిల్లలకు సమగ్ర సర్వశిక్షా అభియాన్ ద్వారా భవిత కేంద్రాల్లో ప్రత్యేక మెళకువలు నేర్పుతున్నారు. వీరు సామాన్యుల్లాగే మెలిగేలా ఈ కేంద్రాల్లో తీర్చిదిద్దుతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 13 పాతవి, 6 కొత్తవి కలుపుకొని 19 కేంద్రాలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. గత సర్వే ద్వారా జిల్లాలో 1459 మంది దివ్యాంగులను ఐఈఆర్పీలు గుర్తించారు. ఇందులో ఐదేళ్ల పైబడిన వారు 120, భవిత కేంద్రాల్లో ఉన్నవారు 172, పాఠశాలల్లో చేర్చిన వారు 974, ఇంటి వద్ద విద్య కొనసాగుతున్న వారు 95, బడిబయట ఉన్నవారు 98 మంది ఉన్నారు.
ఐఈఆర్పీ ద్వారా సర్వే..
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఐన్క్యూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) ద్వారా ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో సర్వే నిర్వహించి గుర్తిస్తారు. ఆ తరువాత వీరిని భవిత కేంద్రానికి రప్పించేందుకు కృషి చేస్తారు. ఒక్కో ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్ శారీరక, మానసిక, వినికిడిలోపం తదితర 21 రకాల కేటగిరి వైకల్యం ఉన్న పిల్లలకు నిత్యకృత్యాలు మొదలుకొని మెళకువలు నేర్పిస్తారు. పిల్లల అవసరాలను గుర్తించి చేతికర్రలు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు తదితర పరికరాలను అందించి వాటి సహాయంతో శిక్షణ ఇస్తుంటారు. చేతులు, కాళ్లు, కీళ్ల వంకర, ఎముకల్లో చీలిడ ఉన్న పిల్లలకు సర్వశిక్షా అభియాన్ ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తారు. వారంలో ఒక రోజు ఫిజియోథెరపీ చేయిస్తుంటారు. నిత్యం ప్రత్యేక కృత్యాల ద్వారా విద్య, స్పీచ్థెరపీ అందిస్తారు.
కేంద్రం పరిధిలో వారంలో (శనివారం) ఒకరోజు ఒక ఐఈఆర్పీ నలుగురు పిల్లలకు ఇంటి వద్దే విద్యాబుద్ధులు నేర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంతేకాకుండా వీరికి సదరం శిబిరం ద్వారా పరీక్షలు చేయించి ఆసరా ఫించన్లు ఇప్పిస్తారు. 2022 నవంబర్లో జరిగిన సదరం శిబిరంలో 305 మంది అర్హత సాధించారు. భవిత కేంద్రానికి వచ్చే దివ్యాంగులకు సమీప పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందేలా చూస్తారు. భవిత కేంద్రానికి ట్రాన్స్పోర్టు ద్వారా వచ్చే దివ్యాంగులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి అలవెన్స్ కింద రూ. 350, ఎస్కార్ట్ అలవెన్సు ద్వారా రూ. 350, గర్ల్స్ ైైస్టెఫండ్ కింద రూ. 200, రీడర్ అలవెన్సు కింద రూ. 60 చెల్లిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎస్కార్ట్ అలవెన్స్ ద్వారా 374 మంది, ట్రాన్స్పోర్టు అలవెన్స్ కింద 155 మంది, గల్స్ ైస్టెఫండ్ కింద 273 మంది, రీడర్ అలవెన్స్ ద్వారా 6 మంది చొప్పున దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారు. 9,10,11,12 తరగతుల వారికి నేషనల్ స్కాలర్షిప్ (ఎన్ఎస్పీ) ప్రోగ్రామ్ ద్వారా ఉపకార వేతనం అందిస్తున్నారు.. ఇందులో 9,10 తరగతులకు రూ. 9వేలు, 11,12 తరగతులకు రూ. 14వేలు స్కాలర్షిప్లను ప్రభుత్వం ఇస్తుంది. దివ్యాంగులకు అలీంకో సంస్థ ద్వారా కూడా పరికరాలు అందిస్తున్నారు. ఆయా భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ఆత్మైైస్టెర్యం పెరగడమే కాకుండా విద్యలోనూ రాణిస్తున్నారు.
మార్కుల తగ్గింపు..
ఈ ఏడాది ప్రభుత్వం వార్షిక పరీక్షల్లో 21 రకాల విభాగాల్లో ఆరో తరగతి నుంచి పదోతరగతి దివ్యాంగ విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులు తగ్గించింది. మూగ, చెవిటి, అంధులు, మెడ సంబంధిత వ్యాధులు, బుద్ధిమాంద్యత, మస్తిష్క, పక్షవాతం, అంగవైకల్యం, వెన్నెముక సమస్యలు, గ్రహణ మొర్రి, గ్రహణ చీలిక, మరుగుజ్జ, లాంటి వారు 10 మార్కులకే ఉత్తీర్ణత పొందేలా ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా ప్రత్యేక అవసరాల దివ్యాంగులు 20 మార్కులు సాధించాల్సి ఉండగా, కొన్ని విభాగాల్లోని సబ్జెక్టులు తగ్గించడం, ఇతరత్రా వసతులు కల్పించారు.
భవిత కేంద్రాలకు రూ. 3.18లక్షలు మంజూరు…
నిర్మల్ జిల్లాలోని 19 భవిత కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 3.18 లక్షలు మంజూరు చేసింది. ఇందులో సొంత భవనాలు ఉన్న భవిత కేంద్రాలకు ఒక్కో దానికి రూ. 12వేల చొప్పున నాలుగు కేంద్రాలకు రూ. 48 వేలు, సొంత భవనాలు లేని 15 కేంద్రాలకు ఒక్కోకేంద్రానికి రూ. 6వేల చొప్పున మొత్తం రూ. 90వేలు మంజూరయ్యాయి. అలాగే కొత్తగా ఏర్పడిన 6 మండలాలకు దివ్యాంగుల పరికరాల కోసం ఒక్కో భవిత కేంద్రానికి రూ. 30వేలు చొప్పున మొత్తం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది.
సమాజంలో రాణించేలా..
భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చూస్తున్నాం. దివ్యాంగ విద్యార్థులు బడిబయట ఉండకుండా, బడిలో చేర్పించడమే కాకుండా ఇండ్ల వద్ద కూడా విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇన్ని రకాల వసతులు కల్పిస్తూ వారికి కావాల్సిన సామగ్రి, ఫిజియోథెరపీ అందిస్తున్నాం.
–రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్ జిల్లా
ఇతరులతో సమానంగా రాణింపు..
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉత్తీర్ణత అయ్యేలా వారికి ప్రభుత్వం మార్కులను కుదించింది. ఆరు నుంచి పదో తరగతి దివ్యాంగులకు వైకల్యం బట్టి 10 మార్కులు, మరి కొంత మంది దివ్యాంగులకు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన చిన్నారులను పూర్వస్థితికి తెచ్చేలా భవిత కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నాం. నిర్మల్ జిల్లాలో 19 భవిత కేంద్రాల్లో 172 మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి చదువుతో పాటు ప్రతి వారంలో ఒకరోజు ఫిజియోథెరపీ, ఒకరోజు ఇంటివద్దే ఐఈఆర్పీలు దివ్యాంగులకు బోధిస్తారు.
–ప్రవీణ్కుమార్, ఐఈ కో-ఆర్డినేటర్, నిర్మల్ జిల్లా