ఆదిలాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ, రైతులు పండించిన పంటకు బోనస్ చెల్లించాలని, ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో 4 వేల ఎకరాల్లో రైతులు జొన్న, కంది, నువ్వు, పొగాకు పంటలను నష్టపోయారని తెలిపారు. రైతులు అహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలు నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. వరితోపాటు రైతులు ఇటీవల విక్రయంచిన సోయా, శనగ పంటలకు ప్రభుత్వం బోనస్ చెల్లించాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వం శనగ కొనుగోళ్లను జరపకపోవడంతో రైతులు దళారులకు పంటను విక్రయించి నష్టపోవాల్సి వస్తుందన్నారు. మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని కోరారు. సాగునీరు లేక పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పంపిణీ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రైతుబంధు పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, మెట్టు ప్రహ్లాద్, లింగారెడ్డి, విజ్జిగిరి నారాయణ, దాసరి రమేశ్, మర్సెట్టి గోవర్ధన్, యాస నర్సింగ్రావు, కుమ్ర రాజు, మెట్టి పోచన్న, సతీశ్, విఠల్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించి ధాన్యం రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందించారు. రేవంత్రెడ్డి సర్కార్ రైతులకు ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాంకిషన్రెడ్డి, లోలం శ్యాంసుందర్, గాదే విలాస్ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీని తొలి సంతకంతోనే అమలు చేస్తామని చెప్పిన సర్కార్ మూడు నెలలు పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదో తెలుపాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతులకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ కిరణ్, మారుగొండ రాము, ఖానాపూర్ రాము, సుభాష్ రావు, నజీర్ పాల్గొన్నారు.