గొల్ల, కురుముల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే మొదటి విడుతలో వేలాదిమందికి అందించగా, ప్రస్తుతం రెండో విడుతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోగా, యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 15,959 మంది లబ్ధిదారులు ఉండగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పంపిణీ ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. మరికొద్ది రోజుల్లో యూనిట్లు అందనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సారంగాపూర్, మార్చి 13 : కుల వృత్తులకు జీవం పోయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గొల్ల.. కురుమలకు సబ్సిడీపై గొర్రెలను అందించి ఉపాధికి భరోసానిస్తున్నది. ఇప్పటికే మొదటి విడుతలో ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కో యూ నిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును కొనుగోలు చేసి అందించింది. ప్రస్తుతం రెండో విడు త పంపిణీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్లో పంపిణీ మొదలు పెట్టి.. ఆగస్టు నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో గొల్ల, కురుమల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సబ్సిడీని పెంచిన ప్రభుత్వం..
మొదటి విడుతలో యూనిట్ విలువ రూ. 1. 25 లక్షలుగా ఉండగా, రెండో విడుతలో యూ నిట్ విలువ రూ. 1.75 లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడి వాటా 25 శాతం.. అంటే రూ. 43,750 డీడీ తీసి ప్రభుత్వానికి ఇ వ్వాల్సి ఉంటుంది. మిగతా డబ్బులు ప్రభుత్వ మే భరిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15,959 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నది. నిర్మల్ జిల్లాలో 7,133, ఆదిలాబాద్ జిల్లాలో 3,300, ఆసిఫాబాద్ జిల్లాలో 1,502, మంచిర్యాల జిల్లాలో 4,024 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 1570 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 2200 మంది లబ్ధిదారులు డీడీలను తీసి ఉంచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వీరందరికీ యూనిట్లు పంపిణీ చేస్తారు. ఇక మిగతా వారిని ఎంపిక చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
పారదర్శకతకు ప్రత్యేక యాప్
గొర్రెల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో లబ్ధిదారుడి ఆధార్కార్డు, ఫొటోతో పాటు పంపిణీ చేసిన గొర్రెలు, కొనుగోలు చేసిన వ్యాపారి వివరాలు, గొర్రెల చెవిపోగు నంబర్ నమోదు చేయున్నారు. దీనివల్ల గొర్రెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశముండదు.
కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి
రెండో విడుత గొర్రెల పంపిణీకి గొల్ల, కురుమ కులస్తులకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచి ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు వరకు పూర్తి చేస్తాం. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం. అర్హులందరికీ అందిస్తాం.
– జీ. శంకర్, జిల్లా పశువైద్యాధికారి, నిర్మల్ జిల్లా