దహెగాం, మార్చి 28 : దహెగాం మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అనల లక్ష్మణ్ వైద్యం వికటించి గాదం నీలక్క మృతి చెందినట్లు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాంనాయక్ సదరు వైద్యుడికి చెందిన మారుతి క్లినిక్లో విచారణ చేపట్టారు. గాదం నీలక్కకు తాను ఎలాంటి వైద్యం చేయలేదని ఆర్ఎంపీ డిప్యూటీ డీఎంహెచ్వోకు రాత పూర్వకంగా రాసి ఇచ్చాడు.
ఆర్ఎంపీ శిక్షణ పొందిన సర్టిఫికెట్ చూపమని కోరగా, ఆర్ఎంపీ శిక్షణ పొందలేదని లక్ష్మణ్ తెలిపాడు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అందులో జారీ చేసిన తేదీ లేకపోవడం గమనార్హం. ఓపీ రిజిస్టర్ లేదని, వైద్యంకోసం వచ్చే రోగుల వివరాలను నమోదు చేయడంలేదని ఆర్ఎంపీ ఆయన దృష్టికి తీసుకొచ్చాడు.
డిప్యూటీ డీఎంహెచ్వో ఆపై నీలక్క ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి నివేదికను డీఎంహెచ్వోకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ నెల 26న అధికారులు విచారణ కోసం వెళ్లగా మారుతి క్లినిక్ మూసి ఉండడంతో వెనుదిరిగారు. ఈ విచారణలో వైద్యాధికారి స్పందన, పీహెచ్ఎన్ పావని, సీహెచ్వో వెంకట్ ఉన్నారు.