ఎదులాపురం, జూలై 3: పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, బీసీ కుల వృత్తుల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్ల చొప్పున గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఈ పథకం కింద 3 విడుతల్లో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3లక్షల ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ధరణిలో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారం కింద గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయించాలన్నారు. అలాగే రెండో దశ గొర్రెల పంపిణీ పూర్తి చేయాలన్నారు వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నిర్దేశిత ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎం నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఆర్డీవో కిషన్, డీబీసీడీవో రాజలింగు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.