సోన్, ఫిబ్రవరి 7 ;ఆ ఊళ్లలోకి వెళ్తే చాలు.. పచ్చని పైర్లు మనసును దోచేస్తాయి. కాలమేదైనా రకరకాల పంటలతో కళకళలాడుతూ ఆహ్లాదాన్ని పంచుతాయి. నిర్మల్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండే న్యూవెల్మల్, బొప్పారం గ్రామాల రైతులు సాగులో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ, అధికంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా అరుతడి పంటలైన సోయా, నువ్వులు, వేరుశనగ, మక్క తదితరాలపై దృష్టిపెట్టి, మంచి దిగుబడి సాధిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్, సాగునీరు, ఇతర పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూవెల్మల్, బొప్పారం జంట గ్రామాలుగా పిలువబడుతుంటాయి. ఈ రెండు గ్రామాల్లో రైతులు తమకున్న సాగునీటి వనరులను సద్వినియోగించుకొని ఏడాదిలో మూడు పంటలు పండిస్తున్నారు. తద్వారా ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. 20 ఏళ్లుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. శ్రీరాంసాగర్లో ముంపునకు గురైన ఈ జంట గ్రామాలు 30 ఏళ్ల కింద పునరావాసం కింద ఏర్పడ్డాయి. రోడ్డుకు అటు, ఇటు ఈ గ్రామాలు ఉండడంతో వెల్మల్ బొప్పారం గ్రామాలుగా ప్రజలు పిలుస్తారు. శ్రీరాంసాగర్ సరస్వతీ కెనాల్ ఈ గ్రామం ద్వారా వెళ్తుండడంతో రైతులు కాలువ నీటిని ఉపయోగించు కొని పంటలు పండిస్తున్నారు. మరికొందరు బోర్లు వేసుకొని సాగు చేస్తున్నారు. గతంలో రెండు పంటలనే పండించగా, ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్ను సద్వినియోగం చేసుకుంటూ ఏడాదికి మూడు పంటలు వేస్తున్నారు.
1800 ఎకరాల్లో..
న్యూవెల్మల్, బొప్పారం గ్రామాల్లో 1800 ఎకరాల్లో పంటలు పండిస్తారు. మొత్తంగా 900 మంది రైతులు ఉన్నారు. చాలా మంది రైతులకు వ్యవసాయ భూమి తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎర్రరేగడి నేలలు కావడంతో, భూమి సారాన్ని బట్టి పంటలను ఎంచుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జూన్ నెలలో సోయా, మొక్కజొన్న పంటలను వేస్తారు. ఈ పంటలు సెప్టెంబర్లో చేతికి వస్తాయి. పచ్చి మక్క కంకులను స్థానికంగా విక్రయించుకొని ఆదాయం పొందుతారు. సోయా పంటను కూడా సెప్టెంబర్లో విక్రయించడంతో అక్టోబర్లో రెండు పంటలకు సిద్ధమవుతారు. అక్టోబరులో మార్కెట్లో ఆయిల్కు భలే డిమాండ్ ఉండడంతో వేరుశనగను వేస్తారు.
దీని పంట కాలం 120 రోజులు కావడంతో ఫిబ్రవరి లోపు చేతికొస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో పచ్చి పల్లికి భలే డిమాండ్ ఉంది. దీంతో రైతులు పచ్చి పల్లిని తీసి సంచుల్లో నింపి స్థానికంగా అమ్ముకోవడమే కాకుండా నిజామాబాద్, నాగ్పూర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు కూడా ఇక్కడి నుంచే తరలిస్తారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ. 7వేల వరకు ధర పలుకుతోంది. గతంలో పచ్చి పల్లి కాకుండా పల్లి తీసి ఆరబెట్టి మార్కెట్కు తరలిస్తే మార్కెట్లో రూ. 8-10వేల వరకు ధర పలికేది. వేరుశనగ ఎండబెట్టడంతో తూకంలో బరువు తక్కువగా ఉండడం వల్ల రైతులకు మార్కెట్లో లభిస్తున్న ధర గిట్టుబాటు అయ్యేది కాదు. దీంతో రైతులు పచ్చి వేరుశనగనే విక్రయించి ఆదాయం పొందుతున్నారు. దీనికితోడు వేరుశనగ గ్రాసానికి స్థానికంగా డిమాండ్ ఉంది. పశువులకు ఇది మేత కోసం ఉపయోగపడడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు పల్లికాడ్ను (గ్రాసం) ట్రాక్టర్, ఎడ్లబండ్ల ధరతో విక్రయిస్తారు.
ప్రస్తుతం వీటి ధర వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పలుకుతోంది. ఒక ఎకరంలో వేరుశనగ పంటను సాగు చేస్తే ఎకరానికి 18-20 క్వింటాళ్ల దిగుబడి రావడంతో మంచి ఆదాయం వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి మాసంలో మూడో పంట కింద నువ్వు సాగు చేస్తారు. దీనికి కేవలం నాలుగైదు తడుల నీరు అవసరం ఉండడంతో వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ పంటను ఎంచుకుంటున్నారు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి రాగా, మార్కెట్లో రూ. 10వేలకు ధర పలకడంతో రైతులు ఈ పంటలను ఎంచుకొని ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. గతంలో వ్యవసాయ రంగానికి 9 గంటల కరెంటు మాత్రమే ఉండేది. రెండు పంటలు వేసుకోవాలంటేనే ఇబ్బందులకు గురయ్యే రైతులు ఇప్పుడు 24 గంటల కరెంటుతో మూడు పంటలను సాగు చేస్తూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికి మూడు పంటలు..
నాకున్న రెండెకరాల భూమిలో ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తున్న. మక్క, వేరుశనగ, నువ్వు పంటలు వేస్తున్న. ఇప్పుడు వేరుశనగ పంట కోత దశకు వచ్చింది. వారం రోజుల్లో దీన్ని కోసి పచ్చి పల్లిని అమ్మి, తర్వాత నువ్వుల పంటను వేస్త. ఏడాదంతా పంటలు ఉంటే మాకు పని కూడా ఉంటది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తనే మాకు నాలుగు పైసలు మిగులుతయ్.
–బాలాయి చిన్నయ్య, రైతు, న్యూవెల్మల్
ఆరుతడి పంటలతోనే ఆదాయం..
తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే ఆరుతడి పంటలను వేసుకోవాలని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వేరుశనగ, నువ్వు, సోయా పంటలపై అవగాహన పెంచడంతో చాలా మంది రైతులు తమకున్న భూముల్లో పండిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నాం. పంటలపై చీడ పురుగుల నివారణ, భూసార పరీక్షలపై అవగాహన పెంచి పంట మార్పిడి విధానం తీసుకురావడం వల్లనే రైతులు ఏడాదిలో మూడు పంటలు పండిస్తున్నారు.
–అంబాజీ, ఏఈవో, సోన్ క్లస్టర్