ఇంద్రవెల్లి, జనవరి 1 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గ్రామాల ప్రజలు సాఫీగా ప్రయాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటితో లక్షణంగా సీసీ రోడ్లను నిర్మించింది. గతంలో అభివృద్ధికి దూరం ఉన్న గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మండలంలోని కేస్లాపూర్, దస్నాపూర్, గౌరాపూర్, హర్కాపూర్ఆంధ్గూడ, వాగాయితండా, సమక, ఇంద్రవెల్లి, వాల్గొండ, ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్లు ప్రత్యేక చర్యలు తీసుకొని సీసీ రోడ్లు నిర్మించారు. గతంలో వానకాలం వచ్చిందంటే మట్టిరోడ్లన్ని చిత్తడిగా మారేవి. ప్రజలు నడువలేని పరిస్థితులు ఉండేవి. ప్రతి గ్రామంలో మూడు నుంచి నాలుగు సీసీ రోడ్లు నిర్మించి చిత్తడి నుంచి ప్రజలకు శాశ్వతంగా దూరం చేశారు. దీంతో గ్రామాల్లో వాహనాలతో పాటు కాలినడకన వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి.
తీరిన సమస్యలు
గ్రామాల్లో మట్టిరోడ్లు వానకాలంలో చిత్తడిగా మారేవి. సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజలకు సమస్యలు తీరాయి. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నది. మా గ్రామంలో సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ చాలా చోట్ల సీసీరోడ్లు నిర్మించారు.
-మెస్రం షేకు, కేస్లాపూర్, గ్రామస్తుడు
మట్టి రోడ్లకు ఇక చెక్
గ్రామాల్లో మట్టిరోడ్లతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అన్ని గ్రామాల్లో నిర్మించాం. గ్రామాలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి.
-మెస్రం నాగ్నాథ్,మాజీ సర్పంచ్, కేస్లాపూర్