ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నేటి(సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4,12,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు అమ్మకాల్లో ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఈ యేడాది పత్తికి క్వింటాలుకు రూ.7,020 మద్దతు ధర నిర్ణయించగా.. జిల్లా వ్యాప్తంగా 11 సీసీఐ కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి పత్తిని సేకరించనున్నారు. అక్రమాలు చోటు చేసుకోకుండా.. ఆధార్ కార్డుతో కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– ఆదిలాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానాకాలం సీజన్లో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లాలో నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది. దీంతో ఏటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గతేడాది 3,83,251 ఎకరాల్లో రైతులు తెల్ల బంగారాన్ని పండించిగా, ఈ ఏడాది 4,12,436 ఎకరాల్లో పంటను వేశారు.
గతేడాది జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ వెచ్చించి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేశారు. మద్దతు ధర రూ.6,380 ఉంటే రూ.9 వేల వరకు చెల్లించి, పంట సేకరించారు. ఈ ఏడాది పంట కొనుగోళ్లకు అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సారి ఆధార్ అనుసంధానంతో రైతుల వద్ద నుంచి పంట సేకరించనున్నారు. ఇందుకు మార్కెట్ యార్డుల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. పంట విక్రయానికి సంబంధించిన డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి.
రైతులు ఈ సీజన్లో సాగుచేసిన పత్తిని నేటి నుంచి కొనుగోలు చేయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో 28.87 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్ వస్తుందని అంచనా వేసిన అధికారులు, ఆదిలాబాద్, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ పరిధిలో 11 సీసీఐ కేంద్రాల్లో ఆదిలాబాద్లో రెండు, బేల, ఇచ్చోడ, బోథ్, సొనాల, పొచ్చర, నేరడిగొండ, ఇంద్రవెల్లి, నార్నూర్లలో మద్దతు ధరతో పంట సేకరించనున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాకు రూ.7,020 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది రూ.6,380 ఉండగా, రూ.640 పెంచింది. జిల్లాలోని 18 జిన్నింగ్లో సీసీఐ అధికారులు లీజుకు తీసుకొని సేకరించిన పత్తిని ప్రాసెసింగ్ చేయనున్నారు.