ఆదిలాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 10.18 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 62 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్లో 3.90 లక్షల ఎకరాల్లో 27 లక్షల క్వింటాళ్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3.23 లక్షల ఎకరాల్లో 13 లక్షలు, నిర్మల్ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో 8 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో 14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే చాన్స్ ఉంది. జూన్లో పంట వేయగా.. అక్టోబర్ మొదటి వారం నుంచి పత్తి ఏరడం ప్రారంభమైంది. 25వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో క్వింటాలుకు రూ.7,950 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. పది రోజుల్లో పత్తి ధర క్వింటాలుకు రూ.8,500 వరకు పెరిగింది. తర్వాత క్వింటాలుకు రూ.8 వేల నుంచి రూ.8,200 వరకు పలుకగా.. ప్రస్తుతం రూ.9వేల వరకు చేరి రికార్డు సృష్టించింది.
రికార్డు స్థాయిలో ధర
గతేడాది పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.5,825 ఉండగా.. ప్రభుత్వం ఈ సా రి రూ.200 పెంచి రూ.6,025 ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యం లో మద్దతు ధరతో అధికారులు కొనుగోళ్లు ప్రా రంభించగా.. ప్రైవేట్ వ్యాపారులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు ధర అధికంగా ఉండడంతోపాటు దేశవ్యాప్తంగా పంట సాగు విస్తీ ర్ణం తగ్గడంతో ఈ ఏడాది పత్తికి డిమాండ్ ఏర్పడింది. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో క్విం టాలుకు రూ.8,900 ధర పలుకగా, భైంసా మార్కెట్లో రూ.9వేలు పలికింది. మద్దతు ధ ర కంటే రూ. 2,975 చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. మంచి ధర రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ధర వస్తుంది..
ఈ ఏడాది పత్తికి ప్రారంభం నుంచి మంచి ధర వస్తున్నది. నేను నాలుగెకరాల్లో వేయగా నెల రోజుల క్రితం 10 క్వింటాళ్లు, గురువారం ఆరు క్వింటాళ్లు అమ్మగా.. క్వింటాలుకు రూ.8,650 చొప్పున రూ.51,900లు వచ్చాయి. ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
గతంలో గింత రేటు రాలే..
నేను సాన్నాళ్లుగా పత్తి ఏత్తన్న. గింత ధర ఎప్పుడూ రాలే. నేను గురువారం ఎనిమిది క్వింటాళ్ల పత్తి అమ్మా. క్వింటాలుకు రూ.8,650 చొప్పున జిన్నింగ్ వ్యాపారులు కొన్నరు. రూ.69,200 వచ్చాయి. ఎక్కువ రేటు రావడం ఆనందంగా ఉంది.
పత్తి ధర కలిసొచ్చింది..
పత్తి ధర కలిసొచ్చింది. ఈ ఏడాది పత్తి మంచి దిగుబడి వచ్చి మధ్యలో వానలు అధికంగా కురవడంతో పిందె రాలిపోయినా మళ్లీ చిగురువచ్చింది. నాకున్న మూడెకరాల్లో ఎకరానికి 8 క్వింటాళ్ల చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పది రోజుల క్రితం క్వింటాలుకు రూ.8,600 చొప్పున అమ్మగా 12 క్వింటాళ్లను రూ.1.03 లక్షలు వచ్చాయి. ఇంకా మిగిలిన 12 క్వింటాళ్ల పత్తిని ఈ రోజు(గురువారం) భైంసా మార్కెట్కు తీసుకొచ్చిన.క్వింటాలుకు రూ.9 వేల చొప్పున అమ్మగా రూ.1.08 లక్షలు వచ్చాయి. సంతోషంగా ఉంది.