దస్తురాబాద్: కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్( BRS ) ఆధ్వర్యంలో దస్తురాబాద్ మండల కేంద్రంలో రైతులకు బాకీ కార్డులను( Dues cards ) పంపిణీ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు, రైతు భరోసా, పంటల మద్దతు ధర, రుణమాఫీ తదితర అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే బాకీ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై ప్రజల్లో చర్చ జరగాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.