సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ తిరిగి పునఃప్రారంభమైంది. సెప్టెంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడగా.. ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 6,7 తేదీల్లో నామినేషన్లు తీసుకోని 10వ తేదీన పరిశీలన పూర్తి చేసిన అధికారులు 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఈనెల 8వ తేదీన ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా.. బరిలో ఉండే సంఘాలపై స్పష్టత రానుంది.
హై కోర్టు కూడా ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు నామినేషన్లు వేసిన 13 కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక అధికారి, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి వ్యాప్తంగా 39,832 మంది కార్మికుల ఓట్లు ఉండగా.. ఇందులో 14,985 మంది మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లోనే ఉండడం విశేషం. ఇక్కడ ఎవరికీ లీడ్ వస్తే వాళ్లే గుర్తింపు సంఘంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాగా.. అప్రమత్తమైన కార్మిక సంఘాలు ఎన్నికల ప్రచార ప్రక్రియను మొదలు పెట్టనున్నాయి.
మంచిర్యాల, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యిందో లేదో.. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే అక్టోబర్ 28న ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు తీసుకొని 10వ తేదీన పరిశీలన పూర్తి చేసిన అధికారులు 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కోల్బెల్ట్ ఏరియా పరిధిలోని కలెక్టర్లు కూడా లేఖలు రాశారు. దీంతో హైకోర్టు ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను ఇలాగే ఉంచి, డిసెంబర్ 27వ తేదీన ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నామినేషన్లు వేసిన 13 కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఎన్నికల ప్రత్యేక అధికారి, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం స్పష్టత
ఈ నెల 8వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం వేసిన నామినేషన్ల ఉపసంహరణ ముగియనుంది.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐకి పొత్తులున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కలిసి పని చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే 8వ తేదీ తరువాతే బరిలో ఉండే కార్మిక సంఘాలపై స్పష్టత రానున్నది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రచారం మొదలుపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో కార్మిక సంఘాలు అప్రమత్తమయ్యాయి. గేట్ మీటింగ్, సింగరేణి కాలనీల్లో ప్రచారానికి వ్యూహాలు రచించుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా సింగరేణి ఎన్నికల్లో కీలకం కానున్నది.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా.. ఇందులో మూడు ఏరియాలు మన జిల్లా పరిధిలోకే రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఏరియాల కంటే శ్రీరాంపూర్ ఏరియాలో అధిక ఓట్లు ఉన్నాయి. మందమర్రి కూడా పెద్ద ఏరియా కావడం, బెల్లంపల్లిలోనూ 1000 మంది కార్మికులు ఉండడంతో అన్ని సంఘాలు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాయి. మొత్తం సింగరేణిలో 39,832 కార్మిక ఓటర్లు ఉండగా.. ఇందులో 14,985 మంది మంచిర్యాల జిల్లాలోని మూడు ఏరియాల్లోనే ఉండడం విశేషం. ఇక్కడ ఎవరికీ లీడ్ వస్తే వాళ్లే గుర్తింపు సంఘంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు సింగరేణి ఎన్నికలపై పడింది.