ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 19 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికలు సిద్ధం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 21వ తేదీన హైదరాబాద్లో ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశం ఉన్నందున మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుబంధు, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ, కొత్త రేషన్ కార్డులకు అర్హుల అంచనాలు, పెన్షన్లు, మహాలక్ష్మి, గృహాలక్ష్మి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాలవారీగా ధరణి, భూ సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై పూర్తి సమాచారం అందించాలని వివరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతివారం మండలాలవారీగా పెండింగ్ గ్రీవెన్స్ల సమీక్ష చేయాలని, దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు గుండెపోటుతో ఈనెల 18వ తేదీన మృతిచెందిన భీంపూర్ తహసీల్దార్ నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, శ్యామలాదేవి, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవోలు స్రవంతి, జివాకర్, అధికారులు పాల్గొన్నారు.