కాగజ్నగర్, ఏప్రిల్ 1 : పార్లమంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి అదనపు దీపక్ తివారీ, ఆర్డీవో సురేశ్కుమార్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు విధుల గురించి సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీవో డైరీ, 17సీపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
పోలింగ్ ప్రారంభానికి ముందే మాక్ పోలింగ్ నిర్వహించాలని, వీవీ ప్యాట్లలో ఉండే స్లిప్లను ప్రత్యేక కవర్లో భద్ర పరచాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే సెక్టోరల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బూత్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లకు సీల్ వేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పోస్టర్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 450 మంది ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు, ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్1 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాలలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో సురేశ్, తహశీల్దార్ శ్రీనివాస్ దేశ్పాండేతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే సెక్టోరల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.