బోథ్, నవంబర్ 2: బోథ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ వెల్లడించారు. గురువారం ఆర్వో చాహత్ బాజ్పాయ్తో కలిసి బోథ్ ఆర్వో కార్యాలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల పాటు నిషేధాజ్ఞలు అమలవుతాయన్నారు. అభ్యర్థితో పాటు నలుగురికి కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. నామినేషన్ ప్రక్రియ నాటి నుంచి అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.
సువిధ యాప్ ద్వారా సభలు, ర్యాలీలు, ప్రచార వాహనాలు, ఇతర వాటి కోసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతిలేని వాటిని సీజ్ చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల వారు ఎన్నికల కమిషన్ నియమావళిని పాటించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలను బోథ్ సీఐ భీమేశ్ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు నామినేషన్ కేంద్రం, హెల్ప్ డెస్క్లో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అంతుబాటులో ఉన్న తహసీల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ సుభాష్చందర్, అధికారులు ఉన్నారు.
బోథ్, నవంబర్ 2 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోథ్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తహసీల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆర్వో కార్యాలయానికి ఇరువైపులా వంద మీటర్ల పాటు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆ రూట్లో 144 నిషేధాజ్ఞలు విధించారు. శుక్రవారం నుంచి ఈ నెలా 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆర్వో చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేష్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులను కలిసి ఐదుగురిని కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. నామినేషన్ పత్రాల జారీ, అఫిడవిట్, సందేహాల నివృత్తి కోసం ఆర్వో కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల నియమావళిని అనుసరించాలని కోరారు.
ఎదులాపురం, నవంబర్ 2 : తెలంగాణ శాసన సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ షెడ్యూల్ మేరకు ఆదిలాబాద్ ,బోథ్ శాసన సభ నియోజక వర్గాల్లో ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) నుంచి నిర్వహించే నామినేషన్లు స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు ఆయా రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల వరకు మూడు వాహనాలకు అనుమతి ఉంటుందని, అభ్యర్థితో పాటు నలుగురు మద్దతుదారులతో కలిసి నామినేషన్ సమర్పించవచ్చని తెలిపారు. జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ దరఖాస్తులో అన్ని ఖాళీలను పూరించాలని, సంబంధిత పత్రాలను సమర్పించాలన్నారు.