ఎదులాపురం, ఆగస్టు 27 : సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సివిల్ సర్వీసెస్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి అధ్యయనం, పరిశోధనలో భాగంగా 14 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు సోమవారం నుంచి సెప్టెంబర్ మూడు వరకు రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని గ్రామీణ ప్రజల జీవన విధానం, గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కళలు, జీవనోపాధి తదితర విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తదితరాలపై వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్ర పర్యటన అధికారుల సర్వీస్కి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ, గిరిజనుల అభ్యున్నతికి ఐటీడీఏ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరి సంస్కృతి, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, వ్యవసాయం, గిరిజన యువతకు ఉద్యోగ, గిరివికాసం వంటి పథకాలపై వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, డీఆర్డీవో కిషన్, డీఈవో ప్రణీత, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.