చెన్నూర్, మార్చి 26: చెన్నూర్ మున్సిపాలిటీలో 20023-24 వార్షిక సంవత్సరానికి గాను వంద శాతం పన్నుల వసూళ్లకు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ నిర్దేశించిన గడువులోపల లక్ష్యం చేరుకుంటారా? అనే సందేహం వ్యక్తమవుతున్నది. మున్సిపాలిటీలో ప్రస్తుత పన్నులు రూ.1.45 కోట్లు, బకాయి పన్నులు రూ.1.01కోట్లు కలిపి మొత్తం రూ.2.46 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రస్తుత పన్నులు, బకాయి పన్నులు కలిపి సుమారుగా రూ.1.30కోట్లు(54 శాతం) వసూళ్లు చేశారు. నిర్దేశించిన గడువుకు ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో 46 శాతం పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది.
పన్నుల వసూళ్లను వంద శాతం సాధించేందుకు అధికారులు మాత్రం అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు పన్నులు చెల్లించాలని, బకాయి పడిన పన్నులపై 90 శాతం వడ్డీని మాఫీ చేస్తున్నామని, పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని వార్డుల్లో ఆటోల్లో తిరుగుతూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో పలు కూడళ్లల్లో పోస్టర్లను అతికించారు. మున్సిపాలిటీ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి వార్డుల్లో తిప్పుతూ ఇండ్ల వద్దకే వస్తూ పన్నులను వసూళ్లను చేస్తున్నారు.
అయినప్పటికీ పన్నుల వసూళ్లలో 60శాతానికి చేరుకోలేక పోయారు. అధికారులు మాత్రం గడువు లోపల వంద శాతం చేరుకుంటామని చెబుతున్నారు. ఇంకా వసూళ్లు చేయాల్సిన పన్నుల్లో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినవి రూ.20 లక్షల వరకు ఉన్నాయని, కూల్చి వేయబడిన ఇండ్లకు సంబంధించిన పన్నులు రూ.18 లక్షల వరకు ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన పన్నులు, కూల్చి వేయబడిన ఇండ్లకు సంబంధించిన పన్నులను కలుపుకుంటే లక్ష్యాన్ని చేరుకున్నట్లేనని అధికారులు తెలుపుతున్నారు.