మంచిర్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి సభ జనాలకు నిరాశే మిగిల్చింది. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు రెండు గ్యారెంటీల అమలును ప్రకటిస్తారని అంతా భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క నుంచి ప్రకటనలు కూడా వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్ నిర్వహించే మొట్టమొదటి సభపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఆరు గ్యారెంటీలతోపాటు మరెన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం తొలిసభ పెట్టడం, ఎం పీ ఎన్నికలకు శంఖారావం పూరిస్తారనే ప్రచారం జరగడంతో కచ్ఛితంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినైనా అమలు చేస్తారనుకున్నారు. కానీ.. సీఎం రేవంత్రెడ్డి మా త్రం త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభిస్తామని చెప్పి వదిలేశారు.
ఆ రూ.500ల సిలిండర్ అమలు కూడా ప్రి యాంకాగాంధీ రాష్ర్టానికి వచ్చి చేస్తారని చెప్పడంతో ఇప్ప ట్లో ఆ పథకం అమలులోకి వస్తుందా? రాదా? ఈ రెండు పథకాలకు సంబంధించి ఓ తేదీనైనా ప్రకటిస్తే బాగుండనే గుసుగుసలు వినిపించారు. తెలంగాణ పునర్నిర్మాణం అనే పేరుతో పెట్టిన సభలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం కోసం చేయాల్సిన పనులపై, అమలు చేసే కార్యక్రమాలపై స్పష్టత లేకుండా కేవలం విమర్శలకే సీఎం రేవంత్ ప్రాధాన్యం ఇచ్చారు. సీఎం హోదాలో ఆయన ప్రసంగం సాగలేదని, చాలా పేలవంగా ఉందనే టాక్ వినిపించింది. 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను 15 రోజుల్లో భర్తీ చేస్తామని చెప్తూనే ఆయన కోర్టు కేసులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తావించడంతో ఇందులోనూ ఏదో మెలిక ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభను ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించారు. ఆ సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చాక తొలి సభను ఇక్కడే నిర్వహించారు. దీంతో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలో వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా పథకం ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. తాగునీళ్లు, రోడ్లు, అభివృద్ధి పనులు చేస్తామని మాత్రమే సీఎం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని చెప్పారే తప్ప ప్రత్యేకంగా ఎలాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే స్పష్టత ఇవ్వకపోవడంతో జనంలో గందరగోళం నెలకొంది.
నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ.. వాటికి ఇచ్చే నిధులు, ఎప్పుడు పనులు ప్రారంభిస్తామనే అంశాలను ప్రస్తావించలేదు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేస్తే, రేవంత్రెడ్డి సీఎం హోదాలో వారికి నియామక పత్రాలు ఇచ్చారనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ రెండు లక్షల ఉద్యోగాల్లో ఏడు వేల స్టాఫ్నర్సుల ఉద్యోగాలు చేర్చిన సీఎం ఇంకా లక్షా తొంబైవేల పోస్టులు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందంటూ సిగ్గులేకుండా ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 317 జీవో ఉద్యోగుల విషయంలో స్పష్టత ఇవ్వాలని, పోడు భూములు పంపిణీ చేయాలని, ఐటీడీఏలో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరినప్పటికీ.. సీఎం రేవంత్రెడ్డి ఆ డిమాండ్లను అసలు పరిగణలోకే తీసుకోకపోవడం గమనార్హం.
సీఎం రేవంత్రెడ్డి సభ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.50కి మొదలుకావాల్సి ఉండగా.. సీఎం సభకు వచ్చే సరికి 4.50 అయ్యింది. సీఎంను చూసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి జనం రాక మధ్యాహ్నం 12 గంటల నుంచే మొదలైంది. ట్రాఫిక్ సమస్యటతో పోలీసులు దూరంగా వాహనాలు నిలిపివేయగా కిలోమీటర్ల కొద్ది జనం నడుచుకుంటూ సభకు వచ్చారు. 2 గంటలకు సభకు జనం వచ్చేటప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. సీఎం రాక ఆలస్యమవడం, దూరం నుంచి నడిచిరావడంతో జనం దాహంతో అల్లాడిపోయారు.
నీటి సరఫ రా లేక, సభ ప్రాంగణంలో నీడ లేక మండే ఎండలో మాడిపోయారు. రేవంత్రెడ్డి ఆలస్యంతో సభలో మిగిలిన నాయకులను మాట్లాడించారు. అలా ఒక్కో నాయకుడి ప్రసంగానికి ముందు, ప్రసంగం అయ్యాక జనం వాటర్, వాటర్ అంటూ గట్టిగా అరిచారు. వాటర్ లేదని తెప్పిస్తున్నామని నాయకులు చెప్పినప్పటికీ.. తాగునీరు అందలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలు సీఎం కోసం ఎదురు చూశారు. కొందరైతే దాహానికి తట్టుకోలేక బయటికి వెళ్లి మంచినీళ్లు తాగి వచ్చారు. ఒక ప్లానింగ్ లేకుండా హడావుడిగా సభ నిర్వహించి ఇబ్బందులు పెట్టడంపై జనం అసహనానికి గురయ్యారు.