మంచిర్యాల, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నీరా‘జనం’ పట్టింది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ప్రాంగణం ముందున్న రోడ్డు, పక్కనున్న పొలాలన్నీ జనసంద్రమై కనిపించాయి. సభాప్రాంగణం. పార్టీ కార్యాలయం, కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాలకు పోయే దారులన్నీ గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో నిండిపోయాయి. సభకు ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి వేలాది మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సభకు తరలివచ్చారు. ఆసిఫాబాద్ శివారులో ప్రేమలా గార్డెన్ పక్కన ముఖ్యమంత్రి బహిరంగ సభా ప్రాంగణం ఉండగా ఉదయం 11 గంటల నుంచే జనం రాక మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటలకే ప్రాంగణం నిండిపోయింది. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్.. నినాదాలతో మార్మోగింది.
ప్రత్యేక వాహనాల్లో తరలింపు..
జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ నుంచి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల డిపోల నుంచి 230 బస్సులను సమకూర్చారు. నియోజకవర్గానికి 115 బస్సుల చొప్పున కాగజ్నగర్, ఆసిఫాబాద్కు కేటాయించారు. ప్రైవేటు బస్సులు, ఆటోలు, టాటా ఏస్లు మరో 1200 వాహనాలు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా వ్యక్తిగత వాహనాల్లో నలుమూలల నుంచి జనాలను తరలించారు. ఆసిఫాబాద్ నుంచి 25 వేల మంది, కాగజ్నగర్ నుంచి 25వేల మందిని తరలించారు. ఎక్కడికక్కడ మారూమూల గ్రామాలు, తండాలు, గూడేల నుంచి గిరిజనులు సీఎం సభకు తరలివచ్చారు. పోడు పట్టాల పంపిణీ ఉండడంతో రైతులు భారీగా ట్రాక్టర్లు, వ్యాన్లలో వచ్చారు. సభా వేదికకు వచ్చే వాంకిడి రోడ్డు, కాగజ్నగర్ నుంచి వచ్చే బైపాస్రోడ్డు, జన్కాపూర్, చిర్రకుంట, మంచిర్యాల రోడ్లలో పట్టణ శివారులోనే పార్కింగ్ ఏర్పాటు చేసి జనాలను సభకు పంపించారు.
ఎనిమిదెకరాల ప్రాంగణంలో..
బహిరంగ సభా ప్రాంగణంలో జనం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో భారీ కేడ్లు ఏర్పాటు చేసి కుర్చీలు వేయించారు. ప్రాంగణంలో ఉన్నవారంతా సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించేలా 8 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లో ఏసీ కూలర్లు, తాగునీరు సరఫరా చేయించారు. మహిళల కోసం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు, వలంటీర్లు సమన్వయం చేశారు.