దస్తురాబాద్, జనవరి 20 : నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సదుద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో పేద కుటుంబాల్లో కల్యాణలక్ష్మి పథకం వెలుగులు నింపుతున్నది. ఏడున్నరేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవంతంగా పథకాన్ని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా నిలుస్తున్నారు. పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు రూ.1,00,116 అందిస్తున్నారు. తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు.
ఆడ బిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకుడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. అర్హులైన కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తుండడంతో వారు భరోసాగా పిల్లల పెండ్లిలు చేస్తున్నారు. మొదటల్లో రూ.51 వేలు మాత్రమే ఇచ్చారు. 2017, మార్చి 13న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఈ సాయాన్ని రూ.75, 116కు పెంచారు. 2018, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.1,00,116 పెరిగింది. అప్పులు చేసి బిడ్డల పెండ్లిలు చేయాల్సిన దుస్థితి నుంచి తల్లిదండ్రులను రా్రష్ట్ర ప్రభుత్వం గట్టెక్కించింది. అర్హుల ఎంపిక, నిధుల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. గ్రామాల్లో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడినట్లు అయింది. మండలంలో ఇప్పటి వరకు 521 కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,06,35,570 విలువైన చెక్కులను ఎమ్మెల్యేతో పాటు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారులకు నయా పైసా ఖర్చు లేకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మంజూరైన సొమ్ము మొత్తం చేతికి అందుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాహానికి ముం దు గానీ, తర్వాత గానీ అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటూ తల్లిదండ్రులు మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందజేస్తున్నారు. వాటిని పరిశీలించి, క్యాంపు కా ర్యాలయానికి తీసుకెళ్లి ఎమ్మెల్యేతో సం తకం చేయిస్తున్నారు. ఆ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల పూర్తి వివరాలు ఆరా తీసిన పిదప సాయం మంజూరు చేస్తున్నారు.
ఆపదలో ఆదకుంటున్న దేవుడు సీఎం కేసీఆర్. పేదలందరికీ సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉన్నారు. మనుమరాళ్లు చిన్నగా ఉన్నప్పుడే నా చిన్న కూతురు, అల్లుడు ఇద్దరు చనిపోయారు. వారికి ఇద్దరు ఆడ బిడ్డలు. వారిని నేను సాధుకుంటున్నా. నా పెద్ద మనుమరాలికి ఇటీవలే పెండ్లి చేశా. కల్యాణలక్ష్మి పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు పెద్ద దిక్కు అయ్యారు. ఈ పథకం ద్వారా అందిన రూ.1,00,116 మా మనుమరాలి పెండ్లికి అయిన ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. ప్రభుత్వం సాయం మరువలేం. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం.
– కల్యాణలక్ష్మి చెక్కుతో పిట్ల రాజవ్వ, లబ్ధిదారు
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,116 కట్నం పెట్టి పేదింటి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారు. మేము ఇద్దరం అక్క చెల్లెల్లం (కవల పిల్లలం). మాకు గత సంవత్సరం ఏప్రిల్లో (తొమ్మిది నెలల క్రితం) ఒకేసారి పెండ్లిలు చేశారు. మా నాన్నతో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కు కోసం దరఖాస్తు చేసుకున్నాం. అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేపట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.1,00,116 చొప్పున మా ఇద్దరికీ ఒకేసారి రూ.2,00,232 చెక్కులను ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. నిరుపేద ఆడబిడ్డల పెండ్లిల కోసం సహాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– గాజుల శిరీష,మనుషా, లబ్ధిదారులు, రేవోజిపేట
ఆడపిల్లల పెండ్లి చేసేందుకు ఖర్చులకు భయపడుతున్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి ఆసరాగా నిలుస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న రూ.1,00,116తో సంతోషంగా పెళ్లి చేసి బిడ్డను అత్తగారింటి పంపుతున్నారు. అయిన వాళ్లే ఆర్థికసాయం చేయమంటే ఆమడదూరం పోతున్న ఈ రోజుల్లో తెలంగాణ సర్కార్ ఈ పథకం పెట్టి ఆదుకోవడం సంతోషంగా ఉంది. నిరుపేద కుటుంబానికి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ఆడపిల్ల పెండ్లికి సీఎం కేసీఆర్ సాయం చేస్తున్నారు. ఆడబిడ్డల తరఫున సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– సంతపూరి శారద, జడ్పీటీసీ, దస్తురాబాద్