నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 45,784 మందికి మాఫీ
2018 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా విపత్తు వచ్చినా, లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశారు. తాజాగా రూ.లక్ష లోపు మాఫీ చేస్తామని ప్రకటించారు. జిల్లాలోని 1,17,806 మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా.. వీరి బ్యాంకు ఖాతాల్లో విడుతలవారీగా రూ.1,079.08 కోట్లు జమ కానున్నాయి. అయితే ఇప్పటివరకు 45,784 మంది రైతుల ఖాతాల్లో రూ.258.77 కోట్లు జమయ్యాయి. మిగతా వారికి విడుతలవారీగా ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– నిర్మల్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ)
నిర్మల్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తుండడంతో జిల్లాలోని 1,17,806 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరి బ్యాంకు ఖాతాల్లో విడుతలవారీగా రూ.1,079.08 కోట్లు జమ కానున్నాయి. వీరిలో ఇప్పటికే 45,784 మంది రైతులకు రూ.258.77 కోట్లు మాఫీ అయ్యాయి. అయితే కొందరు రైతుల బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పటికీ వారికి లబ్ధి చేకూరలేదు. ఆధార్ అప్డేట్ లేకపోవడం, ఒకే ఆధార్ నంబరుతో పలువురి ఖాతాలు ఉండడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల జిల్లా వ్యాప్తంగా 5,804 మంది రైతులకు చెందిన బ్యాంకు ఖాతాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాల్లో ప్రభుత్వం రూ.52.38 కోట్ల రుణమాఫీ డబ్బులను జమ చేసినప్పటికీ.. రైతులు ఆ ప్రయోజనాన్ని పొందలేక పోతున్నారు. అలాంటి వారు వ్యవసాయాధికారులను సంప్రదించి ప్రభుత్వం అందజేసిన రుణమాఫీ సహాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. రైతు రుణమాఫీతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పాలిట దేవుడు..
తానూర్, సెప్టెంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీ చేయడం సంతోషం. రుణం మాఫీ అవుతుందో లేదో అని ఎదురు చూశా. రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి ఉక్కు సంకల్పం అభినందనీయం. రైతులకు సకాలంలో రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ అందించి రైతుల పాలిట దేవుడిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు.
సంతోషానికి అవధులు లేకుండా అయ్యాయి..
ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 29 : నాపేరు మాలేపు పెద్దన్న. మాది ఖానాపూర్ మండలం రాజురా గ్రామం. నాకు గ్రామ శివారులో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతిసారి వరి, పసుపు, మక్క సాగు చేస్తాను. 2018లో రూ.80 వేలు పంట రుణంగా తీసుకున్నా. యేటా బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి వడ్డి కట్టిపించుకున్నారు. ఈ సారి కూడా పోన్ చేయగానే అనుకున్న వడ్డి కోసం చేశారని. కానీ.. తీపికబురు అందించారు. నువ్వు తీసుకున్న పంట రుణం రూ.80 వేలు మాఫీ అయ్యాయి అన్నడంతో నా సంతోషానికి అవధులు లేకుండా అయ్యాయి. మళ్లీ పంట రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. మళ్లీ నాకు పంట రుణంగా రూ.లక్ష కూడా ఇవ్వనునన్నారు. మూడో విడుతలో రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తానన్న మాట కేసీఆర్ నెరవేర్చారు.
రూ.97 వేలు మాఫీ అయ్యాయి..
పొన్కల్ బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో రూ.97 వేలు పంట రుణం తీసుకున్నా. ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నా. సీఎం కేసీఆర్ పెద్దన్నలా నా అప్పును ఒకేసారి బ్యాంకులో కట్టేశారు. నా సెల్ఫోన్కి రుణమాఫీ చేసినట్లు మెస్సేజ్ వచ్చింది. ఇది నిజమోకాదో అని బ్యాంకుకి వెళ్లి తెలుసుకున్న. రూ.97 వేలు మాఫీ అయ్యాయన్నారు.
– చిట్యాల రాజరెడ్డి, రైతు, పొన్కల్, మామడ మండలం.