ఆరు అంశాలు.. మూడు స్థాయిలు..
2021-22కు నమోదుకు అవకాశం
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 6 : దేశంలోని స్వచ్ఛ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. అన్ని రకాల పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీటి సరఫరా, గార్డెనింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తీరును అంచనావేసి, ఉత్తమ పనితీరు చూపిన పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందించనుంది. దీంతో జిల్లాలోని ప్రతి పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-22కు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
పరిశీలించే అంశాలు..
తాగునీరు, మరుగుదొడ్లు, చేతులు సబ్బుతో కడుక్కోవడం, పరిశుభ్రత నిర్వహణ విధానం,పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, కొవిడ్-19 జాగ్రత్తలు, బాధ్యతల వంటి ఆరు అంశాలను పరిశీలిస్తారు. ఈ అంశాలలోప్రతి కేటగిరీకి సంబంధించిన సమాచారం, ఫొటోలు వెబ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మూడు కేటగిరీలు..
జిల్లా స్థాయిలో ఎనిమిది పురస్కారాలతోపాటు కేటగిరీలవారీగా 30 అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 20 పురస్కారాలతోపాటు కేటగిరీలవారీగా ఆరు అవార్డులను అందిస్తారు. జాతీయ స్థాయిలో మొత్తం 40 పురస్కారాలతోపాటుగా కేటగిరీవారీగా ఆరు అవార్డులను అందజేస్తారు. వీటిని అర్బన్(పట్టణ), రూరల్(గ్రామీణ) పాఠశాలలకు వేర్వేరుగా ఇవ్వనున్నారు. స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2021-22 కోసం దరఖాస్తు చేసిన సమాచారం(డాటా) సమర్పించేందుకు మొబైల్ యాప్ను రూపొందించారు. http://play.google.com/store/apps/details?id=com.glt.svp2022 ద్వారా చేయవచ్చు. http://www.swatchvidyalayapuraskar. com అనే వెబ్ సైట్ ద్వారా కూడా చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్లో 2022 మార్చి లోపు అన్ని పాఠశాలలు రిజిస్టర్ చేసుకొని సమాచారాన్ని సమర్పించాలి.
విధిగా నమోదు చేసుకోవాలి..
కేంద్ర విద్యాశాఖ దేశంలోని అన్ని స్వచ్ఛ విద్యాలయాలకు ఈ పురస్కారాలను అందించనుంది. జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలు మార్చిలోపు విధిగా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన ఆరు అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలి. జిల్లాలోని అన్ని రకాల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు నేడు(సోమవారం) శిక్షణ కార్యక్రమం ఉంటుంది. – ఎస్.వెంకటేశ్వర్లు, డీఈవో, మంచిర్యాల
మంచి అవకాశం..
అన్ని పాఠశాలలకు ఇది మంచి అవకాశం. స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి మార్చిలోపు విధిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలాంటి పురస్కా రాలను ప్రకటించడంతో పాఠశాల నిర్వహణలో పోటీతత్వం పెరిగి వాటి పనితీరు మెరుగుప డుతుంది. స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి నమోదు చేసుకునేందుకు మొబైల్ యాప్ను రూపొందించారు.
– కే.చౌదరి, జిల్లా విలీన విద్య సమన్వయ కర్త, మంచిర్యాల