చింతలమానేపల్లి , మార్చి 8 : మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ విద్యార్థినులు గురువారం హాస్టల్ వదిలి వెళ్లిన ఘటపై జిల్లా అధికారులు స్పందించారు. కస్తూర్బాను జిల్లా కేజీబీవీ ప్రత్యేక ఇన్చార్జి అధికారి సుభాష్, మండల విద్యాధికారి సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్ శుక్రవారం సందర్శించారు. గురువారం రాత్రి ఇళ్లకు వెళ్లిన 11 మందిని తిరిగి స్కూల్కు పిలిపించారు.
హాస్టల్లో ఉండాలని, మిగిలిన పరీక్షలు రాయాలని విద్యార్థినులను అధికారులు కోరగా, ఇందుకు వారు ఒప్పుకోలేదు. మ్యాథ్స్ లెక్చరర్ లేక కనీసం పరీక్షలో అక్షరం కూడా రాయలేకపోయామని, ఈ విషయాన్ని ఇన్చార్జి ఎస్వో శ్రీదేవికి చెప్పుకుంటే.. పోలీస్ కేసులు పెడతామని ఆమె బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డీఈవో ఆదేశాల మేరకు ఇద్దరు పీజీ సీఆర్టీలను కూడా తీసుకువచ్చామని, వారితో మెరుగైన విద్య అందిస్తామని, అందరూ పాస్ అయ్యేలా చూస్తామని అధికారులు విద్యార్థినులకు భరోసా ఇచ్చారు.
పలుమార్లు వారిని సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. ఇక్కడుంటే తమకు వేధింపులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థినులు వెళ్లిపోయారు. కాగా, తన తప్పేమీ లేదని ఇన్చార్జి ఎస్వో జిల్లా అధికారులకు చెప్పడం గమనార్హం. త్వరలోనే ఈ అంశంపై డీఈవోకు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. కాగా, హాస్టల్లో మొత్తం 15 మంది విద్యార్థినులుండగా, ఇందులో 11 మంది వెళ్లిపోయారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉండగా, మరొకరు జ్వరంతో అంతకుముందే ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.