భైంసా, మే 4 : భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లల వైద్యులు ప్ర త్యేకంగా ఉంటూ శిశువులకు వైద్య పరీక్షలు అం దిస్తున్నారు. గతంలో భైంసా పట్టణంలో పిల్లల కు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేట్ దవాఖానల్లో టోకెన్లు తీసుకొని సాయంత్రం వరకు క్యూ లో వేచి ఉండే పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్ర త్యేక చొరవతో ప్రభుత్వ ఏరియా దవాఖానలోనే శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసవాలు చేయడంతో పాటు నవజాత శిశువులు, చిన్నారులకు ప్రత్యేక డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు.
కార్పొరేట్ తరహా వైద్యం..
శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూ నవజాత శిశువుల పాలిట వరంగా మారింది. కార్పొరేట్ దవాఖానల్లో వేలకు వేలు వెచ్చించినా లభించని వైద్యం ఈ ప్రభుత్వ ఏరి యా దవాఖానలో ఉచితంగా అందుతున్నది. ఒకేసారి 10-15 మంది శిశువులకు వైద్యం అందించేలా పరికరాలు అందుబాటులో ఉన్నా యి. ప్రధానంగా నవజాత శిశువులు ఉమ్మనీరు మింగినా, ఊపిరి సరిగ్గా తీసుకోకపోయినా, ఎక్కువ బరువుతో పుట్టినా, ఊపిరితిత్తుల సమస్య తలెత్తినా ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.
పుట్టిన శిశువు ఉష్ణోగ్రతను సాధారణం చేయడానికి, హైడ్రోథెరపీ యూనిట్లతో కామెర్లు వంటి వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు చిన్నారుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి రేడియెంట్వార్మర్ను సైతం ఉపయోగిస్తున్నారు. నవజాత శిశువులతో పాటు చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో పట్టణంలోని ఏరియా దవాఖానలో ముథోల్ నియోజకవవర్గంలోని ఆయా మండలాలకు చెందిన గ్రామాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం వచ్చి ఇక్కడ సేవలు అందిపుచ్చుకుంటున్నారు. ఈ కేర్ సెంటర్లో, దవాఖానలో డాక్టర్లు విజయానంద్, అనిల్, ఇతర సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారు. పిల్లలకు ఏ సమయంలో ఆపద వచ్చినా క్షణాల్లో స్పందిస్తూ దగ్గరుండి చూసుకుంటూ వైద్యం అందిస్తున్నారు.
సేవలను వినియోగించుకోవాలి
మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువుల కోసం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం 10-15 మంది నవజాత శిశువులకు ఏకకాలంలో వైద్య సేవలు అందిస్తున్నాం. ఎస్ఎన్సీయూ కేర్ సెంటర్ ద్వారా అందించే సేవలకు ప్రైవేట్ దవాఖానల్లో అయితే భారీగా ఖర్చవుతుంది. కానీ ఇక్కడ ఉచితంగా సేవలందిస్తున్నాం.
– అనిల్, పిల్లల వైద్యుడు
24 గంటలు అందుబాటులో..
నవజాత శిశువులకు ఎస్ఎన్సీయూ ద్వారా 24 గంటలు సేవలందిస్తున్నాం. ప్రభుత్వ ఏరియా దవాఖానలో జన్మించిన వారే కాకుండా ఇతర దవాఖానల్లో పుట్టి సమస్యతో ఇక్కడికి వచ్చేవారికి కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నాం. ప్రైవేట్లో వృథాగా డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్య సేవలను అందిపుచ్చుకోవాలి.
– డాక్టర్ కాశీనాథ్, ప్రభుత్వ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్