ఆసిఫాబాద్, మార్చి 1 : ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిలాలల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఇంటర్, ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ వార్షిక పరీక్షలను గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడిపించాలని, పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒకరికీ ప్రభుత్వ గ్యారంటీ పథకాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కార్యాలయాల్లో అవసరమైన మేర ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
జిల్లాలో ప్రజా పాలన సేవా కేంద్రాల నిర్వహణ కోసం డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించడంతో పాటు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్ ఇతర సామగ్రిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్రావు, డీఈవో అశోక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్, విద్యుత్ శాఖ అధికారి వాసుదేవ్, జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు ఉదయ బాబు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్, ఏఈ ఫిరోజ్ ఖాన్, జిల్లా పరిషత్ పర్యవేక్షకులు తోటాజీ, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.