ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభ జనసునామీని తలపించింది. అధినేత మంచిర్యాల పర్యటనకు శుక్రవారం ఇసుకేస్తే రాలనంతగా ప్రజానీకం తరలివచ్చింది. జిల్లాకేంద్రంలో సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ప్రారంభోత్సవం, చెన్నూర్, పర్ధాన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్స్, మెడికల్ కాలేజీ, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయగా, అడుగడుగునా నీరాజనం పలికింది. అనంతరం నస్పూర్లో 30 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభకు మండుటెండను సైతం లెక్క చేయకుండా అశేషంగా పోటెత్తింది. సాయంత్రం దాకా ఓపికగా ఉండి, ఆద్యంతం ఆసక్తిగా సాగిన కేసీఆర్ ప్రసంగానికి జేజేలు పలికింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు పింఛన్ రూ.4,016కు పెంచుతున్నట్లు ప్రకటించడంతో హర్షధ్వానాలతో స్వాగతించింది. ‘ధరణి ఉండాల్నా..? తీసేయాల్నా..? ధరణి ఉండాలంటే లేచి నిలబడండి’ అని కేసీఆర్ కోరడంతో సభికులందరూ లేచి నిలబడి మద్దతు తెలిపారు. అప్పటిదాకా మండిపోయిన వాతావరణం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని చిరుజల్లులు పలకరించడంతో పులకరించిపోయారు.
– మంచిర్యాల, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు రాగా, తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలతో జనసునామీని తలపించింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలిరాగా, జిల్లా కేంద్రం కిక్కిరిసిపోయింది. నస్పూర్ శివారులో ముఖ్యమంత్రి బహిరంగ సభ సాయంత్రం ఉండగా, మధ్యాహ్నం 3 గంటల నుంచే ప్రజల రాక మొదలైంది. సీఎం వచ్చే సమయానికి ఇసుకేస్తే రాలనంత మందితో ప్రభం‘జనం’ తలపించింది. సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
చెన్నూర్ నియోజకవర్గంలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1658కోట్లతో నిర్మించనున్న చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.83 కోట్లతో 10 వేల ఎకరాలకు సాగునీరందించే పర్ధాన్పల్లి ఎత్తిపోతల పథకానికి సైతం శంకుస్థాపన చేశారు. రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, 300 పడకల అనుబంధ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.164 కోట్లతో మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులకు కొత్త కలెక్టరేట్ ప్రాంగణం నుంచే శంకుస్థాపన చేశారు. మందమర్రి శివారులో రూ.500 కోట్లతో నిర్మించతలపెట్టిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా, కుల వృత్తులకు రూ.లక్ష, రెండో విడుత గొర్రెల పథకం, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు ఆద్యంతం జనం ఈలలు, చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు.
– మంచిర్యాల, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)