ఇంద్రవెల్లి, ఏప్రిల్ 26 : ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి రేంజ్ పరిధి ధనోరా(బీ) బీట్లోని కొబ్బరిగూడ గ్రామ శివారు పంట పొలాల్లో చిరుత సంచరించినట్లు ఎఫ్ఆర్వో సంతోష్ తెలిపారు. ఈ మేరకు పాదముద్రలను గుర్తించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొబ్బరిగూడ, ధనోరా(కే)గ్రామాలకు చెందిన కొందరు రైతులు వ్యవసాయ పనులు చేస్తుండగా, బుధవారం చిరుత కనిపించిందని సమాచారం అందించారన్నారు. ఇంద్రవెల్లి రేంజ్ అటవీ శాఖ అధికారులు విద్యానంద్, రాజేందర్, కృష్ణకాంత్ అక్కడికి చేరుకొని, చిరుత అడుగులు గుర్తించినట్లు తెలిపారు. చిరుత అక్కడి నుంచి సిరిచల్మ అటవీ ప్రాంతానికి వెళ్లిపోయినట్లు గుర్తించినట్లు చెప్పారు. తమకు సమాచారం అందించిన వ్యక్తితో పూర్తి విచారణ చేయగా, తన ఫోన్లో చిత్రీకరించిన వీడియోను పరిశీలించినట్లు తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు.