పెంబి, ఏప్రిల్ 7 : మండలంలోని మెరునిపరు గ్రామంలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెక్డ్యాం దెబ్బతిన్నది. చెక్డ్యాం పక్కన నిర్మించిన సైడ్ బండ్(మట్టి, బండరాళ్లు) వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో నిలువ ఉండాల్సిన వరద నీరు వృథాగా వెళ్లిపోయింది. దీని ఆయకట్టు పరిధిలో దాదాపు 100-200 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం.. యాసంగిలో మొక్కజొన్న, నువ్వు పంట వేశారు.
ప్రస్తుతం రైతులు చెక్డ్యాంలో నిలిచిన నీటిలో మోటార్లు ఏర్పాటు చేసుకుని సాగు నీరందిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ నిలిచిన నీరు కూడా అడుగంటే దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వర్షాకాలం ప్రారంభానికి ముందే చెక్డ్యాంకు మరమ్మతు పనులను పూర్తిచేసి, సాగు నీరందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.