ఇచ్చోడ, డిసెంబర్ 8 : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్సైట్లోకి ముక్రా(కే) చేరింది. రూఫ్టాప్ సోలార్ పవర్ గ్రిడ్లు, డిజిటల్ లైబ్రరీ, విజయవంతంగా వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు పలు అంశాల్లో ముక్రా(కే) గ్రామం స్వయం సమృద్ధి సాధించి దేశానికి మోడల్గా నిలిచింది. దీనిని ప్రస్తావిస్తూ కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, జల్ శక్తి మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో వివరాలను పొందపర్చింది. సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన, చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ తయారీ, అమ్మకం ద్వారా వచ్చిన నిధులు తదితర వాటితో నవంబర్ 2న సుమారు రూ.4 లక్షలతో రెండు రూఫ్టాప్ 6కేవీ సోలార్ గ్రిడ్లను ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్ ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించడం అభినందనీయమని అభివర్ణించింది. ప్రతి పల్లె ముక్రా(కే)లా తయారు కావాల ని స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, జల శక్తి మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో ఆకాంక్షించింది. సర్పంచ్ గాడ్గె మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించింది.
సంసద్ ఆదర్ష్ గ్రామీణ యో జన (సాగి) కింద ముక్రా(కే) గ్రామాన్ని ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుడు జొగినపల్లి సంతోష్కుమార్కు సర్పం చ్ మీనాక్షి కృ తజ్ఞతలు తెలిపారు. సాగి ద్వారా గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా యంత్రాంగానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.