దిలావర్పూర్, మార్చి 17 : వలసలను నివారించి, స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అనేక మందికి పని కల్పిస్తున్నది. సగటున కూలీకి 100 రోజులు పనికల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టగా.. దిలావర్పూర్ మండలంలో 14,018 మంది కూలీలు ఉన్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పనులకు వెళ్తుండగా.. కనీస వసతులు కూడా కల్పించడం లేదు. ఫలితంగా కూలీలు వడదెబ్బ బారిన పడుతున్నారు.
కనీస వసతులు కరువు
ఉపాధి హామీ పనులు చేపడుతున్న పని ప్రదేశాల్లో కూలీల కోసం టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స పెట్టెలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉంది. కానీ.. వేసవికాలం ప్రారంభమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. పని ప్రదేశం లో సేదతీరేందుకు చెట్లను ఆశ్రయిస్తున్నారు. అవీ కూడా లేకపోతే తలకు తలపాగా చుట్టుకుని ఎండలోనే భోజనం చేస్తున్నారు. తాగడానికి కనీసం నీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. కూలీలే ఇంటి నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నీరు కూడా అయిపోతే బావులు, చెరువుల వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలు ఉన్నాయి. గాయాలు, అస్వస్థతకు గురైనా ప్రథమ చికిత్స కిట్లు కూడా లేవు. దీంతో కొన్నిసార్లు దవాఖానకు చేరేలోపే ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా నామమాత్రంగా అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పాత చీరలే టెంట్లు
సముందర్పల్లి గ్రామంలో జనవరి నుంచి చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 87 మంది ఉపాధి హామీ కూలీలు రోజూ పనులు చేస్తున్నారు. కాగా.. వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దాదాపు 39 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కూలీలు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇంటి నుంచి చీరలను తీసుకొచ్చుకుని తాత్కాలికంగా టెంట్ను ఏర్పాటు చేసుకున్నారు. భోజన విరామ సమయంలో చీరల నీడ కిందనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా.. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా షేర్ నెట్లను అందించేవి. కానీ.. ఇప్పటి ప్రభుత్వాలు షేర్ నెట్లను ఇవ్వకపోవడంతో చెట్ల కింద, తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న చీరల కింద సేదతీరుతున్నారు. షేర్ నెట్లను అందించాలని కోరుతున్నారు.
షేర్నెట్స్ రావడం లేదు..
కొన్నాళ్ల క్రితం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి షేర్ నెట్స్ వచ్చేవి. మండల కేంద్రం నుంచి గ్రామంలోని కూలీల సంఖ్యను బట్టి పంపిణీ చేసేవారు. కూలీలు పని ప్రదేశంలో తాత్కాలికంగా షేర్నెట్స్ వేసుకుని భోజనం చేసేవారు. మధ్యాహ్న సమయంలో సేదతీరేవారు. కొన్నాళ్లుగా సరఫరా నిలిచింది. దీంతో తాము కూలీలకు నెట్స్ అందించడం లేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం.
– దివ్యరెడ్డి, ఏపీవో, దిలావర్పూర్
సర్కారు సౌలతులు కల్పించాలి..
గతంల సర్కారోళ్లు పనిజేసే కాడ మంచినీళ్లు, మందులు ఇచ్చేటోళ్లు. గిప్పుడేమో మందులేమో గని మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నం. ఇగ, పానం బాగా లేకపోతే సోయి తప్పి పడిపోతున్నం. గప్పుడేమో దవాఖానకు పోవాల్సి వస్తున్నది. మేము చేసే పైసలన్ని దవాఖానకే పెట్టాల్సి వస్తున్నది. సర్కారోళ్లు గతంల లెక్క షేర్నెట్లు, మంచినీళ్లు, మందుబిల్లలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నా.
– సజ్జు, లోలం, దిలావర్పూర్
చీరల నీడన తింటున్నం..
నేను రోజూ ఉపాధి పనులకు పోత. గిప్పుడు సముందర్పల్లిలో చెరువు పనులు చేత్తన్నం. జనవరి నుంచి చేత్తుండగా.. ఆరం రోజుల సంది ఎండలు బాగా కొడుతున్నాయ్. గతంల పెద్దసార్లు టెంట్లు ఏర్పాటు చేత్తుండే. ఆటి కింద కూసొని తినేటోళ్లం. గిప్పుడు ఎవ్వలు టెంట్లు ఇయ్యడం లేదు. చుట్టూ పక్కల సూసినం. ఎక్కడ చెట్లు లేవు. గందుకనే నాతో పనిజేసేటోళ్లం అందరం కలిసి ఇంటి నుంచి చీరెలు తెచ్చుకుని టెంటులెక్క ఏసుకున్నం. దానికిందనే మధ్యాహ్నం బువ్వ తింటున్నం. అధికారులు షేర్నెట్స్ వేయించాలని కోరుతున్నం.
– అడెల్ల, కూలీ, దిలావర్పూర్