సీసీసీ నస్పూర్, జనవరి 8 : సీసీసీ నస్పూర్ డంపుయార్డును పొగ కమ్మేసింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. సోమవారం ఉదయం సైతం సింగరేణి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లి మంటలు చల్లార్చారు.
సీసీసీ టౌన్షిప్ నుంచి సీసీసీ కార్నర్, తాళ్లపల్లి, సింగాపూర్ పునరావాసకాలనీ, నాగార్జునకాలనీ, గోదావరికాలనీ షిర్కే, తదితర ప్రాంతాలను పొగ చుట్టేసింది. సమీపంలో ఉన్న చ ర్చి, మసీదు, పోలేరమ్మ, మడేలయ్య, పోచ మ్మ గుడి పొగతో నిండుకుంది. రాత్రి నుంచి ఉదయం వరకు పొగ కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయ్యింది.
ప్రజ లు శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముఖ్యంగా డంపుయార్డుకు సమీపంలోగల ఆశ్రమంలోని వృద్ధులతో పాటు ఆస్తమా రోగులు తిప్పలు పడ్డారు. ఇది వరకు ఇక్కడ సింగరేణి పోగు చేసిన చెత్తను మాత్ర మే పోసేవారు. ఇప్పుడు నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన తడి..పొడి చెత్తను ఇక్కడికే తీసుకొస్తున్నారు. గుట్టలు గుట్టలుగా చెత్త పోగవుతుండగా, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడి నుంచి వెలువడుతున్న పొగ వల్ల శ్వాసకోస వ్యాధులు వచ్చే ప్రమాదముందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు.