కాగజ్నగర్, నవంబర్ 8 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో కాగజ్నగర్ పట్టణంలోని మూతపడిన పేపర్ మిల్లును తిరిగి తెరిపించిన.., అందుకోసం ఎన్నో యాజమాన్యాల దగ్గర తిరిగిని.., నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్న.., నన్ను నమ్మి మూడుసార్లు గెలిపించారు. ఈ సారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో కంపెనీ తెప్పిస్తా..’ అని ప్రజా ఆశీర్వాద సభలో సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజలను కోరారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేయడంతో నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనలు నిర్మించామన్నారు. విద్య, వైద్యం సమస్యలు తీరాయని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని పోడు రైతులకు పట్టాలు ఇచ్చి, రైతు బంధు, రైతు బీమా అందించి న దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పోడు పట్టా పొందిన చింతలమానేపల్లి మండలం ఆడెపల్లి గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య, బెజ్జూర్ మండలం బారెగూడ గ్రా మానికి చెందిన ఆత్రం భీంరావ్ మృతిచెందగా, ప్రభుత్వం రైతు భీమా కింద రూ.5 లక్షల చొప్పున వారం రోజుల్లో వారి నామిని ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గంలో రెసిడెన్సియల్ పాఠశాలలను కళాశాలలుగా మార్చారని, ఇప్పుడు డిగ్రీ కళాశాలలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోనప్ప కోరారు.
నియోజకవర్గంలో 3 వేల గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చినట్లు, మరికొన్ని ఇస్తే ఇంకొదరికి లబ్ధిచేకూరుతుందని తెలిపారు. కుమ్రం భీం, జగన్నాథ్ఫూర్ ప్రా జెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, నిధులు మంజూరు చే యాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ సహకారంతో కౌటాల మండలం తాటిపెల్లి గ్రామంలో రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆ రైతులు సిరులు పండిస్తున్నారని తెలిపారు. గతంలో ఈ ప్రాంతం వారు పనులు లేక వలస వెళ్లేవారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో రెండు పంటలు పండిస్తూ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మ ధ్యప్రదేశ్ రాష్ర్టాల వేలాది మంది కూలీలకు ఉపాధి ఇస్తున్న రైతులు తన నియోజకవర్గంలో ఉండడం గర్వంగా ఉందని వివరించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీలు దండె విఠల్, రఘోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ము న్సిపల్ మాజీ చైర్మన్లు దస్తగిరి, సులేమాన్ బిన్ సయ్యద్, ని యోజకర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కావేటి స మ్మయ్య సతీమణి, మున్సిపల్ మాజీ చైర్మన్ కావేటి సాయిలీల, కొడుకులు మనోహర్, సతీశ్, విజయ్ బీఆర్ఎస్లో చేరారు.
హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపం.. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనంతరం తిరిగి ఆసిఫాబాద్లో సభకు వెళ్లేందుకు హెలిక్యాప్టర్లో ఎక్కగా, సాంకేతిక లోపంతో మొరాయించింది. ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గాన ఆసిఫాబాద్ బయల్దేరారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం హెలిక్యాప్టర్ కాగజ్నగర్ నుంచి ఆసిఫాబాద్కు వెళ్లింది.