ఉట్నూర్, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసుల సంప్రదాయాలు చూడ ముచ్చటగా ఉంటాయి. పండగలు.. అటవీ సంరక్షణ.. అడవులతో ఉన్న బంధం విడదీయరానిది. పండగలు దాదాపు ప్రత్యేకంగా ఉంటాయి. ఆదివాసులకు పుష్యమాసం చాలా పవిత్రమైనది. ఇందులో భా గంగా చాలా ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, జాతరలు షరా మామూలే. కేస్లాపూర్ జాతర ముగియడంతో మెస్రం వంశీయులు మరో జాతరను ప్రా రంభించారు. ఇటీవలే మండలంలోని శ్యాంపూర్లో మెస్రం వంశీయుల పూజలు నిర్వహించి జాతరను షురూ చేశారు. దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు జాతర కొనసాగనున్నది. మండలంలోని శ్యాంపూర్ జాతరకు ప్రత్యేకత ఉంది. ఇప్పటికే కే స్లాపూర్ నాగోబా జాతర, ఉట్నూర్ మండలంలో ని మహాదేవుని జాతర, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలకేంద్రంలో వేంకటేశ్వర జాతర, నార్నూర్ మండలంలోని ఖాందేవు ని జాతరలు పూర్తికాగా, తాజాగా బుడుందేవ్ జా తర ప్రారంభం కానుండడంతో పుష్యమాసం జా తర్లతో గిరిజనులు పూర్తిగా ఆధ్యాత్మికతో గడుపుతారు.
బుడుందేవ్ జాతర చరిత్ర
పూర్వ కాలంలో గౌరపూర్ అనే గ్రామంలోని ఆ వుల మందలో ఉన్న ఆంబోతు (ఎద్దు) పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్ ప్రాంతంలోని పంటలను నాశనం చేస్తుంది. దీంతో ఆగ్రహించిన కోత్వాళ్లు వారి వద్ద ఉన్న ఆయుధంతో సంహరించారని పూర్వీకులు చెబుతుంటారు. మృతిచెందిన ఆంబోతును దూర ప్రాంతంలో పారేసేందుకు వెళ్తుండగా అక్కడ బండరాయిగా మారి బుడుందేవ్గా ఆవతరించిందని వంశపెద్దలు చెబుతున్నారు. నాగోబా జాతర ముగిసిన మరుసటి రోజు నుంచే బుడుందేవ్ను మెస్రం వం శీయులు ప్రత్యేక పూజలతో కొలవడంతో జాతర ప్రారంభం అవుతుంది. సుమారు 10 రోజుల పాటు కొనసాగుతుంది.
పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తులు
మండలంలోని సాలేవాడ-(కే) శివాలయంలో ఒక జాతర, అలాగే శ్యాంపూర్లోని బుడుందేవ్లో మరో జాతర సాగనున్నాయి. ఇందులో బుడుందేవ్ జాతరకు డివిజన్ నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. నాగోబా జాతరలోని అన్ని వ్యాపారాలు, రంగుల రట్నాలు శ్యాంపూర్కు రానున్నాయి.
యేటా ఘనంగా నిర్వహిస్తాం..
మండలంలోనే బుడందేవ్ జాతర పెద్దది. కేస్లాపూర్ జాతర ముగించుకొని మెస్రం వంశీయులు బుడుందేవ్కు పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతర ప్రారంభం అవుతుంది. 7 నుంచి 10 రోజుల పాటు కొనసాగునున్నది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ పుష్యమాసం ఆదివాసులకు చాలా పవిత్రమైనవి. మొత్తం పూజలతో గడపడం ఆనవాయితీగా వస్తున్నది. యేటా లాగే ఘనంగా నిర్వహిస్తాం.
–ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావు
నియమ నిష్టలతో పూజలు..
ఆదివాసులకు పవిత్రమైనది పుష్యమాసం. ఈ మాసంలో ఏజెన్సీలోని చాలా జాతరలు జరుగుతాయి. చాలా నిష్టతో పండుగలు, పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మెస్రం వంశీయులు కుటుంబాలతో వచ్చి పూజలు నిర్వహించి జాతరలను ప్రారంభిస్తారు. బుడుందేవ్ జాతర 10 రోజుల పాటు సాగనున్నది. మండలంతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి.
-మరప బాజీరావు (గిరిజన నాయకుడు, సాలేవాడ-(కే))