కుంటాల, నవంబర్ 23 : వర్షాలకు దెబ్బతిన్న రాస్తా.. అవస్థలు ఎట్టకేలకు తీరుతున్నాయి. మండలంలోని లింబా (కే) ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. భైంసా మండలం వానల్పాడ్ నుంచి లింబా (కే) గ్రామం వరకు 5.30 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.09 కోట్లు మంజూరయ్యాయి. రెండేండ్ల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ రోడ్డు దెబ్బతిన్నది. పూర్తిగా గతుకుల మయంకావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు లింబా (బీ), ఓల, సుంక్లి, సూర్యపూర్, మెదన్పూర్, అంబుగాం గ్రామాల ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నాయకులు రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వివరించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్అండ్బీ శాఖ నుంచి నిధులు మంజూరయ్యేలా తీవ్రంగా కృషి చేశారు.
ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. పనులు సైతం చకచకా సాగుతున్నాయి. కుంటాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడం, ఓల, లింబా (కే) గ్రామాలుండడంతో ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.25 లక్షలు మంజూరయ్యాయి. కాగా, ఓల నుంచి బీటీ రోడ్డు నిర్మించేందుకుగాను ప్రభుత్వం రూ.70 లక్షలు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. గ్రామానికి అనుసంధానంగా బీటీ రహదారుల నిర్మాణం చేపడుతుండడంతో లింబా (కే) గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి గ్రామస్తులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనులు పూర్తి స్థాయి నాణ్యతతో కొసానసాగుతుండడంతో సంతోషం వ్యక్తం చేశారు.
దశల వారీగా అభివృద్ధి..
ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నాయకత్వంలో కుంటాల మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. రూర్బన్ పథకంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. రహదారుల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మండల కేంద్రానికి వెళ్లే ప్రదాన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రాకపోకలు సులభతరం కానున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో దశలవారీగా అభివృద్ధి చేస్తూ సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పని చేస్తున్నారు.
– ఏనుగు శ్రీకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు, లింబా (కే)
ఎమ్మెల్యే విఠల్రెడ్డి కృషితోనే..
మునుపెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు లో రాజీ పడకుండా కృషి చేస్తున్నారు. స్థానికుల విన్నపం మేరకు ప్రజల కష్టాలను చూసి ఇబ్బందులు తొలగించేందుకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారులు ఎమ్మెల్యే చొరవతో అభివృద్ధి చెందుతున్నాయి.
– సవ్వి అశోక్ రెడ్డి