ఆదిలాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో కార్యకర్తలకు యువనేత కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. పార్లమెంట్ పరిధిలో నిర్మల్, ముథోల్, కాగజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు పార్టీని వీడినా నష్టం ఏమి లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు మంత్రి పదవి అనుభవించినా కూడా.. ఓటమి తర్వాత పదవుల కోసం పార్టీలు మారినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు సేవలు పార్టీకి, రాష్ర్టానికి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అవసరమని గుర్తించిన బీఆర్ఎస్ అధినేత ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. కార్యకర్తలు గ్రామస్థాయిలో కష్టపడి బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు.
బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టాలి..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలని ప్రజలకు తెలియజేయాలని యువకిశోరం కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వేలైన్, విమానాశ్రయం ఏర్పాటు, సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభం లాంటి విషయాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడచినా ఎన్నికల హామీలను నేరవేర్చలేదని తెలిపారు. రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, గ్రామాల్లో మంచినీరు, సాగునీటి సమస్యలను ఎండగట్టాలన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను యువతకు తెలియజేయాలని సూచించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల ఆవశ్యకతను తెలియజేయాలని తెలిపారు. కేటీఆర్ ప్రసంగం నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. యువనేత కేటీఆర్ ప్రసంగానికి గులాబీ శ్రేణులు కేరింతలు కొట్టారు. ఆయనను కలువడానికి, ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. ఈ సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు, కుమ్రం భీం మనవడు సోనేరావు, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, విజయలక్ష్మీ, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మథోల్ నియోజకవర్గ పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు రమాదేవి, విలాస్ గాధేవార్, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్మేవార్, నాయకులు సుభాష్, యూనిస్ అక్బానీ, అజయ్, జోగు మహేందర్, లింగారెడ్డి, గోవర్ధన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్మన్
ఎదులాపురం, ఏప్రిల్ 16 : ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తోపాటు పలువురు నాయకులు తిరిగి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఇటీవల బీజేపీలో చేరిన జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, నాయకులు తిరిగి బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడం వల్లనే మళ్లీ బీఆర్ఎస్లో చేరుతున్నట్లు జడ్పీ చైర్మన్ తెలిపారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి..;
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు పాత్ర కీలమన్నారు. ప్రతి ఇంటికి మూడు నుంచి ఆరు పథకాలు అందాయని, లబ్ధిదారులతో మాట్లాడి ఓటును అభ్యర్థించాలని కోరారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని వివరించాలని కోరారు. సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్ర మంత్రి అమిత్షా ఇచ్చిన హామీని మరిచారని, ఎయిర్పోర్టు, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
-జోగు రామన్న, మాజీ మంత్రి
కేసీఆర్కు గెలుపును బహుమతిగా ఇద్దాం..
బీఆర్ఎస్ను గెలిపించి తమ అధినేత కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు అన్నారు. కేసీఆర్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేశారని, రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం, పొడు భూములకు పట్టాల పంపిణీ, జోడేఘాట్లో మ్యూజియం ఏర్పాటు, దండారీ ఉత్సవాలు, ఆలయాలు, జాతరలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రైతుబంధు, రుణమాఫీ, తాగునీరు, సాగునీరు, కల్యాణలక్ష్మి ఇతర పథకాలు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతాయని ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు.
– ఆత్రం సక్కు, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి
ప్రతి బూత్లో 300 ఓట్లు రావాలి..
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2,111 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, గ్రామస్థాయి నాయకులు ప్రతి పోలింగ్ బూత్ నుంచి బీఆర్ఎస్కు 300 ఓట్లు పడేలా కష్టపడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. పక్కా ప్రణాళికతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలిపారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల ఆవశ్యకతను వివరించాలన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని, ఈ ఎన్నికల్లో గెలిస్తే పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సంపాదిస్తుందన్నారు.
– అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే