ఆదిలాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(మంగళవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి యువనేత హాజరుకానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2,111 పోలింగ్ బూత్లు ఉన్నాయి.
ప్రతి పోలింగ్స్టేషన్ నుంచి ఇద్దరు నాయకులు, నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో యువనేత పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రంలో నాలుగు నెలల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రస్తావించే అవకాశాలున్నాయి.
యువనేత పర్యటన సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన అనంతరం గులాబీ పార్టీ ప్రచారం ఉధృతం కానుంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా బోథ్, ఆసిఫాబాద్ నియోజకర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 4,65,476 ఓట్లు రాగా, బీజేపీకి 4,48,967 ఓట్లు, కాంగ్రెస్కు 2,52,281 ఓట్లు వచ్చాయి.
బీజేపీ కంటే బీఆర్ఎస్కు 16,509 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. నిర్మల్, మథోల్ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీని నియమించారు. రెండు నియోజకవర్గాల్లో కొందరు నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు చెక్కుచెదరలేదు. నేడు ఆదిలాబాద్లో జరిగే బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగం నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహన్ని నింపనుంది.