ఆసిఫాబాద్,డిసెంబర్ 6: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీకి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు,అధికారిక కార్యక్రమాల్లో ఆ పార్టీకి ప్రోటోకాల్ తిప్పలు తప్పవు. జిల్లాలోని రెండు నియోజవర్గలోనూ ఆ పార్టీకి ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో, పెద్ద సమస్య వచ్చి పడింది.
ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోవలక్ష్మి, సిర్పూర్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పాల్వాయి హరీశ్బాబు గెలిచారు. ఈ క్రమంలో ప్రభుత్వం అధికారికంగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలే కీలకం కానున్నారు. రెండో చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు శ్యాంనాయక్, రావి శ్రీనివాస్ ఓటమి చెందారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని చెబుతున్నా, జిల్లాలో మాత్రం ప్రోటోకాల్ సమస్యపై ఆ పార్టీ నాయకులు మదనపడుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తే వాటిని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు కూడా ప్రజాప్రతినిధులు పెద్దగా లేకపోవడంతో పార్టీకి జిల్లాలో గడ్డుకాలమే.
జిల్లాలోని 15 మండలాల్లో సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో గ్రామస్థాయిలోనూ అధికార కార్యక్రమాలకు ఆ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించే నాథుడే కరువయ్యారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారి కాల పరిమితి ఉండడంతో స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ప్రోటోకాల్పై బెంగ పెరిగింది.
ప్రభుత్వం ఏర్పాటు జరిగి జిల్లాకు ఇన్చార్జిగా ప్రతినిధిని ఏర్పాటు చేసినప్పటికీ, అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. జిల్లా,నియోజకవర్గ స్థాయిలో జరిగే ముఖ్యమైన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొంటారు. కానీ క్షేత్రస్థాయిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు మాత్రం సమస్య ఉంటుంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడంతో పాటు కోవలక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఆనుభవం ఉంది. ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతూ ప్రజలతో మమేకమై ఉండడం ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ధైర్యాన్నిస్తున్నది. ప్రభుత్వం ఏదైనప్పటికీ ప్రజల మద్దతు ఉన్న పార్టీలోనే కొనసాగాలని పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు.
సిర్పూర్లో హరీశ్బాబు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, అక్కడ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండల, గ్రామస్థాయిలో ఎక్కవ శాతం ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు.ప్రభుత్వం నిధులు ఇస్తే అవి ప్రజల అవసరాల కోసం స్థానిక ఎమ్మెల్యేలు ఖర్చు చేసి అభివృద్ధి జరిపితే బీఆర్ఎస్,బీజేపీ ఎమ్మెల్యేలకే లాభం చేకూరనుంది. ఒక వేళ నిధులు ఇవ్వకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అభాసుపాలు కావడం ఖాయం. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడ్డ రేవుల మారింది. నిధులిస్తే ఒక్క బాధ లేకుంటే మరో బాధ అన్నట్లు తయారైంది.
నెన్నెల, డిసెంబర్ 6: ఈ వర్షంతో పత్తి తడిసి ముద్ద య్యింది. గిప్పుడు ఇగ తడిసిన పత్తిని ఎవ్వలూ కొనరు. పత్తి తీసి ఇంట్లో పెట్టుకుందామన్నా రంగు మారిపోతది. వర్షం కారణంగా మాకెంతో నష్టం వచ్చింది. ఇప్పుడే ధర తక్కువగా ఉంది. తడిసిన పత్తికి ధర మరింత తగ్గిపోతది. వర్షానికి చెట్టుమీద ఉంచితే పెద్ద వర్షం పడితే అంతా భూమి మీద పడి పోతది. ఇట్ల కూడా రైతులకు చాలా నష్టమే వస్తుంది. ఈ తుఫాను వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్లు లేదు. ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేసిన. ఒక్క సారి కూడా పత్తిని తీయ లేదు. రెండు మూడు రోజుల్లో తీద్దామనుకున్న. కానీ ఈ తుఫాను కారణంగా తీయలేకపోయిన. పత్తి తడిసి నల్లబడితే ధర కూడా తక్కువ అయితది. గిప్పుడు మార్కెట్లో ధర కూడా ప్రైవేటులో తక్కువకే కొంటుండ్రు. సీసీఐ లాంటి వాళ్లు తీసుకుంటే ధర పెరుగుతది కావచ్చు. – లింగం మహేశ్, పత్తి రైతు