కుభీర్ : నిర్మల్ జిల్లా బాసర ఆలయం ( Basara Temple ) లో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సోమవారం శంకుస్థాపన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
కుభీర్ మండల కేంద్రం ఉద్యమ నాయకుడు పుప్పాల పీరాజీ తోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, మాజీ సర్పంచ్ జీ బాబు, దత్తాత్రిని సోమవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు, 420 హామీలను బుట్ట దాఖలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ప్రజల్లో తిరుగుతున్న సీఎంను ప్రజలు ప్రశ్నించకుండా ముందస్తు అరెస్టులకు పాల్పడి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం మక్క రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేక విలవిల్లాడుతున్నారని వెంటనే మక్కా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన, ముఖ్యంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.