“ఖానాపూర్ జాన్సన్ నియోజకవర్గమే కాదు.. నేను దత్తత తీసుకో బోయే నియోజకవర్గం కూడా. జాన్సన్ను గెలిపించిన వెంటనే కేసీఆర్తో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. జన్నారంలో ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల, బ్రిడ్జిల నిర్మాణం, ఐటీఐకి సొంత భవనం, ఇందన్పల్లిలో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తాం” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కవ్వాల్ టైగర్ జోన్ను టూరిజం హబ్గా మారుస్తామని, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. కడెం ప్రాజెక్టుకు 12 గేట్లు పెట్టించడం జాన్సన్తోనే సాధ్యమవుతోందని, బీఆర్ఎస్ వస్తేనే మరెన్నో సంక్షేమ పథకాలు వస్తాయని, అమలవుతాయని పేర్కొన్నారు.
– మంచిర్యాల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
2014కు ముందు కాంగ్రెస్ హయాంలో కరంటు కష్టాలు ఎలా ఉండెనో ఎవరైనా పెద్ద మనుషులను అడిగి తెలుసుకోండి. ఎవరైనా చనిపోతే కరంటోళ్లకు ఫోన్ చేసి శవయాత్ర ప్రారంభమైంది.. దహన కార్యక్రమాలు అయ్యాక బాయికాడ స్నానం చేయాలి.. 15 నిమిషాలు కరంటు ఇయ్యండని వేడుకునేది. తెలంగాణ వచ్చాక 24 గంటల కరంటుతో కష్టాలకు చెక్ పడింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పెన్షన్ ఇవ్వడానికే ఆగమాగం చేసినోళ్లు ఇప్పుడు రూ.4వేల పెన్షన్ ఎలా ఇస్తరు.. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా.. అధికారంలో ఉన్నప్పుడు చేయనోడు ఇప్పుడు ఎలా చేస్తాడో ఆలోచించాలి.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరైనా రైతుబంధు ఇచ్చారా.. రైతును రాజు చేయాలనే ఆకాంక్షతో పెట్టుబడి సాయం కింద 70 లక్షల మందికి రూ.73 వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం వేసి అండగా నిలిచింది.
1956లో ఆంధ్ర, తెలంగాణను కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.. 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 370 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిందని, 11 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వారిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని 1971లో మళ్లీ తెలంగాణను పాతాళానికి తొక్కింది హస్తం పార్టీ కాదా ఆలోచించండి. మళ్లీ 2004 నుంచి 2014 వరకు అరిగోస పెట్టి వందల మంది చావడానికి కాంగ్రెస్ కారణం కాదా.
– జన్నారంలో సభలో మంత్రి కేటీఆర్
మంచిర్యాల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాటి నుంచి తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఖానాపూర్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. రెండు సార్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించడం వల్ల 55 ఏండ్లలో జరుగని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. మూడో దఫా జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుందో ఆలోచించి ఆగం కాకుండా, గందరగోళానికి గురి కాకుండా జాగ్రత్తగా ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో గ్రామగ్రామాన, పట్టణాల్లో కుల, యువజన, మహిళా, రైతు సంఘాలు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, సింగరేణి కార్మికులు, అందరి పోరాటంతోనే 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించామని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వారు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
2014కు ముందు కాంగ్రెస్ హయాంలో కరంటు కష్టాలు ఎలా ఉండెనో ఎవరైనా ద్ద మనిషిని అడిగి తెలుసుకోండని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మన జన్నారంలో కానీ, ఖానాపూర్ నియోజకవర్గంలో గానీ.. ఏ గ్రామంలోనైనా ఎవరైనా చనిపోతే కరంటోళ్లకు ఫోన్ చేసి శవయాత్ర ప్రారంభమైంది, దహన కార్యక్రమాలు అయ్యాక బాయికాడ స్నానం చేయాలి.. 15 నిమిషాలు కరంటు ఇయ్యాలే అని వేడుకునే పరిస్థితి ఉండేదని, తెలంగాణ వచ్చాక 24 గంటల కరంటు ఇస్తున్నామన్నారు. ఆ రోజుల్లో కరంటు ఉంటే వార్త అని, కేసీఆర్ వచ్చినంక కరంటు పోతే వార్త అవుతున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో కరంటు ఇబ్బందితో రైతుల బావి మోటార్లు కాలిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవుడు జరిగేవని, రైతులైతే అర్ధరాత్రి, దొంగరాత్రి ఇచ్చే కరంటు కోసం బాయికాడ భార్య, పిల్లలను వదిలి ఉండేవారని, ఆ రోజులు కాల రాత్రులన్నారు.
పాము కుట్టినా, తేలు కుట్టినా, రాత్రిళ్లు తిరుగుతున్నారని నక్సల్స్ అని పోలీసులు కొడితే రైతు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. అంతేకాకుండా ఎరువులు, విత్తనాల కోసం ఆనాడు చెప్పులు లైనులో పెట్టి కాలుతున్న కాళ్లతో, కడుపు ఎండుతుంటే బువ్వ తినడానికి పోయిన రోజులు ఎన్నో ఉన్నాయన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో ఊరు మొత్తం వల్లకాడైందని, కేవలం ఎండిన చెరువులు, కూలిన గోడలు, కాలిన పంటలతో పూర్తి స్థాయిలో అధ్వానపు బతుకులు బతికామన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక రేవంత్రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 24 గంటలు ఎక్కడుందో చూపెట్టాలి.. అసలు కరంటు కనబడుత లేదంటుండు.. అలాంటి కాంగ్రెస్ లీడర్లందరిని ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ గ్రామం, ఏ తండా, ఏ గూడెం, ఏ పంచాయతీకి పోతరో పోయి కరంటు తీగలను గట్టిగ పట్టుకుంటే కరంటు ఉన్నదో లేదో తెలుస్తదని, కాంగ్రెస్ దరిద్రం, శని రెండు పోతయన్నారు. 55 ఏండ్లలో కరంటు, రైతుబంధు, సాగునీరు, తాగునీరు ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడెలా ఇస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పెన్షన్ ఇవ్వడానికే ఆగమాగం చేసినోళ్లు ఇప్పుడు రూ.4వేల పెన్షన్ ఎలా ఇస్తరు..! అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..! అధికారంలో ఉన్నప్పుడు చేయనోడు ఇప్పుడు ఎలా చేస్తాడో ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరైనా రైతుబంధు ఇచ్చారా..! రైతును రాజు చేయాలనే ఆకాంక్షతో పెట్టుబడి సాయం కింద 70 లక్షల మందికి రూ.73 వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం వేసి అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్లో 29 లక్షల మందికి నెలకు రూ. 200 పెన్షన్ వస్తే ఇప్పుడు 46 లక్షల మందికి పది రెట్లు పెంచి రూ.2వేల తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. బీడీలు చుట్టే వారిని ఏ ప్రభుత్వం పట్టించుకోలే.. కేసీఆర్ వచ్చినంకనే రూ.2వేల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నానన్నారు. అలాగే 13.50 లక్షల మంది ఆడ పిల్లలకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద అందజేశామన్నారు. ఇలా అన్ని రంగాల్లో సంక్షేమ బాటలో ముందుకుపోతున్నామని, అబద్ధాల రేవంత్రెడ్డి మాటలు నమ్మవద్దన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల చేతుల్లో పెట్టవద్దని మంత్రి కేటీఆర్ కోరారు. చిదంబరం ఇక్కడకు వచ్చి తెలంగాణ బిడ్డలను మేమే చంపినం, సారీ అంటున్నాడని, అలాంటి కాంగ్రెస్కు ఓటు వేసి దారిద్రాన్ని కోరుకోవద్దన్నారు. 1956లో ఆంధ్రా, తెలంగాణను కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.. 1968లో ఇందిరాగాంధీ 370 మంది బంగారం లాంటి తెలంగాణ పిల్లలను కాల్చి చంపిందని, 11 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వారిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని 1971లో మళ్లీ తెలంగాణను పాతాళానికి తొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వమని, 2004 నుంచి 2014 వరకు అరిగోస పెట్టి, మాట ఇచ్చి తప్పి పది సంవత్సరాలు చావకొట్టి వందల మందిని చావడానికి కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కరంటు, మంచినీరు, సాగునీరు ఇవ్వని, తెలంగాణ ప్రత్యేక రా ష్ట్రాన్ని ఇవ్వని, మనల అష్టకష్టాలు పెట్టిన కాంగ్రెస్కు మళ్లీ అధికారం ఇద్దామా.. ఆలోచించాలన్నా రు.
కేసీఆర్ను గొంతునొక్కేందుకే ఢిల్లీ నుంచి బీ జేపీ లీడర్లు మోదీ, అమిత్ షా, యోగి, బోగి, మం త్రులు, ఎంపీలను.. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియంకా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధ రామయ్య ఇలా చాలా మంది పెద్ద పెద్లోళ్లు వస్తున్నారన్నారు. ఎంత మంది వచ్చినా భయపడేది లేదని, మీ మీదనే ఆధారపడి ముందుకు పోతున్నామన్నారు. మీరు వేసే ప్రతి ఓటు జాన్సన్తోపాటు కేసీఆర్కు అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
మీ నియోజకవర్గం నుంచి జాన్సన్ను గెలిపించిన వెంటనే కేసీఆర్తో మాట్లాడి మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ఇది జాన్సన్ నియోజకవర్గమే కాదు నేను దత్తత తీసుకోబోయే నియోజకవర్గమని మంత్రి కేటీఆర్ అన్నారు. మీ ప్రధాన సమస్యలైన జన్నారంలో ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు, కవ్వాల్ టైగర్ రిజర్వ్లో ఆంక్షలు ఎత్తివేతతోపాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల ఏర్పాటు, కవ్వాల్ టైగర్ జోన్ను టూరిజం హబ్గా రూపొందించడం, రోటిగూడ, లోతొర్రె, గొండుగూడలతో మరికొన్ని గ్రామాలకు అవసరమైన బ్రిడ్జిల నిర్మాణం, ఐటీఐకి సొంత భవన నిర్మాణం, ఇందన్పల్లిలో సబ్స్టేషన్ ఏర్పాటు వంటి సమస్యలంటినీ పరిష్కరిస్తామన్నారు. సన్నాసి పార్టీలతో మోసపోవద్దని, జాన్సన్ను గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నా సొంత నియోజకవర్గాన్ని ఎలా చూసుకుంటానో అలాగే ఖానాపూర్ను చూస్తానని, అడిగిన పనులన్నీ చేస్తామన్నారు.
సదర్మట్ను పూర్తి చేసింది కేసీఆరేనని, కడెం ప్రాజెక్టును, సామర్థాన్ని పెంచాలని జాన్సన్ నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు 12కు పెంచడానికి రూ.600 కోట్లు కావాలని, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక్కడ జాన్సన్ నాయక్ ఉన్నప్పుడే మీరు అడిగిన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కుఫ్టి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీద, కడెం ప్రాజెక్టు కింద పంట పొలాలున్నాయని, వాటి మీద ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం రూ.794 కోట్లతో 2018లోనే జీవో మంజూరు చేశామన్నారు. తర్వాత కరోనా వచ్చి దాన్ని చేయలేకపోయని, దీనిని కూడా తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, నియోజకవర్గ సీనియర్ నాయకులు పైడిపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.