ఆదిలాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలకు వేళయింది. ఈనెల 27వ తేదీన నిర్వహించనుండగా.. రెండు రోజుల(25వ తేదీ) ముందుగానే పండుగ వాతావరణం నెలకొంటున్నది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ముందస్తుగా పార్టీ జెండాలు ఎగురవేయాలని, మూడు వేల మందితో సభలు నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సమావేశాలు నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాజాగా.. ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో ఆదివారం నుంచే జెండా పండుగ ప్రారంభమైంది. ఇంటింటికీ జెండాలు పెట్టి జై కేసీఆర్ నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సబ్బండ వర్గాలు టీఆర్ఎస్(నేటి బీఆర్ఎస్)కు అండగా నిలిచాయి. ఫలితంగా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిం ది. నాటి నుంచి నేటి వరకు జిల్లావాసులు బీఆర్ఎస్ వె న్నంటే నిలుస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకే తమ ఓటు వేసి గెలిపిస్తున్నారు. సభలు, సమావేశాలకు భారీ సంఖ్యలో హాజరై జై కొడుతున్నారు. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రైతులు, కులవృత్తులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజల ఉపాధి మెరుగుపడింది.
25న నియోజకవర్గాల్లో సభలు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండో రోజుల ముందుగానే ఈ నెల 25న(మంగళవా రం) అసెంబ్లీ నియోజకవర్గా ల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం పల్లెలు, పట్టణాల్లోని వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాలు ఎగురవేస్తారు. అనంతరం నియోజకవర్గ సమావేశాలకు తరలివెళ్తారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి పైగా హాజరయ్యేలా జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బోథ్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు సంబంధించి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించి, సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో నియోజకవర్గ ప్రగతిని విస్తృతంగా చర్చిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేసీఆర్ కిట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పంటల కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ, మిషన్ భగీరథ నీటితో తగ్గిన రోగాలపై ఇంటింటికీ వెళ్లి వివరించనున్నారు.
జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు
నెల రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో జరిగే సమావేశాలకు నాయకులు, ముఖ్యకార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది గ్రామాలకు కలిపి ఒక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై ప్రభుత్వ పథకాల వల్ల ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలు తెలియ జేస్తున్నారు.
సక్సెస్ చేయండి..
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాలకు నాయకులు, ముఖ్యకార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలి. మూడు వేలకు పైగా మండల కమిటీ సభ్యులు, 11 అనుబంధ కమిటీల సభ్యులు రావాలి. ఉదయం పది గంటలకు ప్రారంభమైన సమావేశాలు రోజంతా కొనసాగుతాయి. పలు అంశాలపై అజెండావారీగా చర్చలు జరుగుతాయి. నెల రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు విజయవంతంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే 53 పూర్తికాగా.. మిలిగిన 30 సమావేశాలను నిర్ణీత వ్యవధిలో నిర్వహిస్తాం.